ఉదయం 7.30కే ఆఫీస్​కు ముఖ్యమంత్రి.. ఇకపై ఉద్యోగులందరికీ అవే టైమింగ్స్!

By

Published : May 2, 2023, 1:20 PM IST

thumbnail

పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​.. మంగళవారం ఉదయం 7.30కే తన కార్యాలయానికి చేరుకున్నారు. తన కుర్చీలో ఆసీనులై.. పలు పత్రాలపై సంతకాలు చేశారు. అయితే అంత పొద్దున్న కార్యాలయానికి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారంటే?

రాష్ట్రంలో మే 2వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త టైమింగ్స్​ అమల్లోకి వచ్చాయి. ఉదయం 9 నుంచి 5.30 వరకు బదులు.. 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. జులై 15 వరకు కొత్త టైమింగ్స్ అమల్లో ఉండనున్నాయి. విద్యుత్​ ఆదాతో పాటు అనేక ప్రయోజనాల నిమిత్తం పంజాబ్​ సర్కార్​ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త టైమింగ్స్​ ద్వారా రెండున్నర నెలల వ్యవధిలో రూ. 40-42 కోట్ల ఆదా అవుతుందని సీఎం మాన్​ అంచనా వేశారు.

"కొత్త టైమింగ్స్​ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు ఉద్యోగులతో పాటు ప్రజలతో మాట్లాడాం. అందరూ అంగీకరించారు. అందుకే ఈ నిర్ణయాన్ని రెండున్నర నెలల పాటు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తే రోజుకు దాదాపు 350 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులపై నెలకు రూ.16-17 కోట్లు ఆదా అవుతుంది. ఉదయం 7.30 గంటలకే కార్యాలయాలు తెరిస్తే.. ప్రజలు కూడా ఉదయాన్నే తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత వారి మిగతా పనులు చూసుకోవచ్చు" అని ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ చెప్పారు.

"ఆఫీసుల కొత్త టైమింగ్స్​.. దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో అమలు చేయాలి. అప్పుడు ట్రాఫిక్​ సమస్యలు కూడా తీరతాయి. అయితే జులై 15 తర్వాత ఈ కొత్త సమయ వేళలపై మరోసారి సమీక్ష నిర్వహిస్తాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం" అని మాన్​ తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.