Goa Formation Day Celebrations in Rajbhavan : 'దేశం ఒక్కటే అన్న భావన ప్రజల్లో ఉండాలి'
Goa State Formation Day Celebrations in Telangana Rajbhavan : రాష్ట్రాలుగా విభజించినా.. దేశం ఒక్కటే అన్న భావన ప్రజల్లో ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతిని ఆరాధించే వ్యక్తులకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమైన గోవా అవతరణ వేడుకలను తెలంగాణ రాజ్భవన్లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఫెర్నాండేజ్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్, జేఎన్టీయూ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ చెనాయ్తో కలిసి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం రాష్ట్రాల మధ్య సరిహద్దులను చెరిపేస్తుందన్న గవర్నర్.. దేశమంతా ఐక్యంగా ఉందనే విషయాన్ని చాటుతుందన్నారు. తెలంగాణ రాజ్ భవన్ ఆదివాసీల కోసం ఎంతో కృషి చేస్తుందన్న తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండానే 6 గ్రామాలను దత్తత తీసుకుని వారికి మౌలిక వసతులు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.