MLA Raghunandan Rao Slams BRS Government : దళితులకు దళితబంధు ఇస్తామని.. ఎందుకు ఇవ్వలేదు : రఘునందన్ రావు
Published : Oct 21, 2023, 4:28 PM IST
Dubbaka MLA Ragunandan Rao Slams on BRS Government : దళితులకు దళితబంధు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాకలోని తన నియోజకవర్గంలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం తాను గెలిచిన కొన్ని రోజుల్లోనే నూతన మండలాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన నామినేటెడ్ పదవిలో ఉన్న ఈ గ్రామ పెద్దమనిషి బెదిరింపు రాజకీయాలు చేసుకుంటూ ఓ పార్టీకి ఓట్లు అభ్యర్థించడం ఎంతవరకు సమంజసమో ఈ గ్రామప్రజలు ఆలోచించాలని కోరారు.
10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నాయకులకు మండలం ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచన రాలేదో ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రతి గ్రామానికి బెల్టు షాపులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. కొలువులు ఇవ్వడంరాని ప్రభుత్వం.. వైన్ షాపుల టెండర్లను షెడ్యూల్ కంటే ముందే నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత ప్రజలు బాగుండాలంటే మరోసారి పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.