బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. రాత్రంతా నరకయాతన.. చివరకు..

By

Published : May 1, 2023, 3:33 PM IST

thumbnail

ఓ ఏనుగు పిల్ల ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు పురాతన బావిలో పడింది. తల్లి ఏనుగు సైతం అక్కడే ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్​కు ఆటంకం కలిగింది. ఫలితంగా ఏనుగు పిల్ల రాత్రంతా బావిలోనే నరకయాతన అనుభవించింది. సోమవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభించిన అటవీ అధికారులు.. ఎట్టకేలకు ఏనుగు పిల్లను బయటకు తీశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి ఏనుగు పిల్లను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్​పుర్​లో జరిగింది.  

ఇదీ జరిగింది
జుజుముర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బసియాపడ అటవీ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ ఏనుగు పిల్ల అక్కడే ఉన్న ఓ పురాతన బావిలో పడిపోయింది. దీంతో బావి నుంచి బయటకు రాలేక.. గట్టిగా అరిచింది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులకు ఓ ఇబ్బంది ఎదురైంది. తల్లి ఏనుగు అక్కడే ఉండి, అడ్డుకోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్​ ముందుకు సాగలేదు. దీంతో చేసేదేమీ లేక ఆటవీ అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. తిరిగి సోమవారం ఉదయం తల్లి ఏనుగు వెళ్లాక సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్​ ప్రారంభించిన అధికారులకు వర్షం రూపంలో మరో ఆటంకం కలిగింది. సుమారు 3 గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు.. ఏనుగు పిల్లను సురక్షితంగా బయటకు తీశారు. పైకి వచ్చిన ఏనుగు పిల్ల కాసేపు గందరగోళం సృష్టించింది. బావిపై గుమికూడిన ప్రజలపైకి వెళ్లింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు.    

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.