T20 World Cup : ఐసీసీ మెగా టోర్నీల చరిత్రలో పాకిస్థాన్పై భారత్ ఆధిక్యం మరోసారి కొనసాగింది. ఆసీస్ వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్లో పాక్పై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది. 'సండే-బ్లాక్ బస్టర్గా' నిలిచిన మ్యాచ్ పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యక్షంగా మెల్బోర్న్ మైదానంలో వీక్షించిన అభిమానుల సంఖ్య 90 వేలకుపైనే. కొన్ని నగరాల్లో ఏకంగా సినిమా హాల్స్లోనే ప్రత్యేకంగా మ్యాచ్ను చూసేందుకు ఏర్పాట్లు చేయడం గమనార్హం.
ఇక మ్యాచ్ను లైవ్ ఇచ్చిన డిస్నీ-హాట్స్టార్ యాప్ వ్యూవర్షిప్లో కొత్త రికార్డును సృష్టించింది. ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్కు దాదాపు 1.40 కోట్ల వ్యూవర్షిప్ రాగా.. ఈసారి మాత్రం 1.80కోట్లను దాటేసిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు పాక్ దిగిన సందర్భంలో హాట్స్టార్ యాప్లో 36 లక్షల మంది భువీ వేసిన మొదటి బంతి నుంచి లైవ్లో వీక్షించారని పేర్కొన్నాయి. పాక్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆ సంఖ్య 1.1 కోట్లకు చేరింది. ఇన్నింగ్స్ బ్రేక్ నాటికి 1.4 కోట్లకు పెరగగా.. టీమ్ఇండియా ఛేదనలో తొలి బంతిని 40 లక్షల మంది వీక్షించారు. ఛేజింగ్ చివరికి వీక్షకుల సంఖ్య 1.80 కోట్లకు చేరుకొని రికార్డు నమోదు చేసింది.
"ఐనాక్స్లోని 90కిపైగా స్క్రీన్లలో, 51 నగరాల్లోని పీవీఆర్ 122 స్క్రీన్లలో మ్యాచ్ను లైవ్గా ఇచ్చాం. అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. బ్లాక్బస్టర్ మూవీ రేంజ్లో వీక్షించారు. క్రికెట్ స్టేడియాల్లో ఉండే వాతావరణమే థియేటర్లలోనూ తలపించింది. బిగ్ స్క్రీన్ల మీద లైవ్ చూడటం అద్భుతమైన అనుభూతి" ఇదీ పీవీఆర్, ఐనాక్స్ ప్రతినిధుల స్పందన.
ఇవీ చదవండి : కొత్త పోస్టర్లతో టాలీవుడ్లో దీపావళి సందడి
సితార డ్యాన్స్ సూపర్.. స్పెషల్ వీడియోతో మహేశ్ దీపావళి విషెస్