ETV Bharat / sukhibhava

వ్యాక్సిన్ 'కాక్​టైల్'​కు గ్రీన్​సిగ్నల్.. ఫలితం ఉంటుందా?

author img

By

Published : Aug 12, 2021, 4:00 PM IST

vaccine mixing
మిక్సింగ్​

కరోనాపై విజయం సాధించేందుకు ప్రపంచ దేశాలు శక్తికి మించి కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. 'టీకాల మిశ్రమ డోసుల'(vaccine cocktail) వ్యూహం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. దీనిపై భారత్​లో పరిశోధనలు జరగనుండగా.. అనేక దేశాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తుండటం(vaccine mixing trial) ఆశాజనకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు దీని వెనకున్న సిద్ధాంతం ఏంటి? ఏ దేశంలో పరిశోధనలు ఎలా ఉన్నాయి? దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

టీకాల మిశ్రమ డోసుల(vaccine cocktail) అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఈ వ్యవహారంపై పరిశోధనలు మొదలుపెట్టేశాయి. ఇప్పుడు భారత్​ కూడా సిద్ధమైంది (vaccine mixing India). దేశంలో ఇటీవలే ఐసీఎంఆర్​ నిర్వహించిన ఓ అధ్యయనంలో సానుకూల ఫలితాలు వెలువడటం ఆశాజనకంగా మారింది.

వేర్వేరు టీకా డోసులతో..

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఐసీఎంఆర్​ అధ్యయనం నిర్వహించింది. ఓ గ్రామంలోని 18 మంది.. ఈ ఏడాది మే నెలలో టీకా తొలి డోసుగా కొవిషీల్డ్​ తీసుకున్నారు. అది జరిగిన ఆరు వారాలకు.. వైద్యుల నిర్లక్ష్యంతో రెండో డోసుగా కొవాగ్జిన్​ను తీసుకున్నారు.

కొవిషీల్డ్​ తీసుకున్న 40మంది, కొవాగ్జిన్​ తీసుకున్న 40మందిలో టీకాల ప్రభావంపై వేరువేరుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత వారిని ఈ 18 మందితో పోల్చారు. టీకాల మిశ్రమ డోసులు తీసుకున్నా సురక్షితమేనని నిర్ధరణకు వచ్చారు. అలాగే ఒకటే టీకా తీసుకోవడం కన్నా.. ఇలా రెండు వేర్వేరు టీకాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించారు.

ఇదీ చూడండి:- భయపెడుతున్న కరోనా వేరియంట్లు.. ఎలా జాగ్రత్తపడాలి?

అయితే ఈ అధ్యయనం కేవలం 18మందిపైనే జరిగిందన్న విషయాన్ని గ్రహించాలి. సంఖ్య పెరిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అందువల్ల ఈ పరిశోధనలు ప్రాథమిక దశలోనే ఉన్నట్టు గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

సిద్ధాంతం..

కొవిడ్​కు ముందే ఈ టీకాల మిశ్రమ డోసుల వ్యవహారం చర్చల్లో ఉంది. ఈ వ్యాక్సిన్ కాక్​టైల్ వల్ల మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

సాధారణంగా.. టీకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రోగనిరోధక శక్తిని పెంచితే.. మరొకటి.. వైరస్​పై పోరాటానికి టీ కణాలను సృష్టిస్తుంది. ముందుగా వెక్టర్​ ఆధారిత టీకా తీసుకున్న తర్వాత ఇంకొక టీకాను ఉపయోగించడం ఈ మిశ్రమ డోసుల సిద్ధాంతం. దీని వల్ల ముందు రోగనిరోధక శక్తి పెరిగి, ఆ తర్వాత టీ కణాల ప్రతిస్పందనను సృష్టించవచ్చు.

ఏ దేశంలో ఎలా..?

ఈ వ్యవహారంపై పరిశోధనలు ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. చాలా వరకు సానుకూల ఫలితాలే లభిస్తున్నాయి.

  • భారత్​..

కొవిడ్‌-19 నివారణకు వాడే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసుల మిశ్రమంపై దేశంలో ప్రయోగాలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ అధ్యయనం, క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతాయి. ఈ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతించాలని గత నెలలో ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని నిపుణుల బృందం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

  • రష్యా..

రష్యాకు చెందిన ప్రత్యక్ష పెట్టుబడుల నిధి.. టీకాల మిశ్రమ డోసులు తీసుకోవడంపై పరిశోధనలు చేస్తోంది. ఆస్ట్రాజెనెకాతో రష్యా రూపొందించిన స్పుత్నిక్​-వీని కలుపుతోంది. ఇలా చేసినా.. ప్రతికూల ప్రభావం పెద్దగా లేదని చెబుతోంది. దీర్ఘకాల కొవిడ్​ కేసులు కూడా లేవంటోంది. ఈ నెలలో ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక బయటకు వస్తుంది.

  • డెన్మార్క్​..

ఆస్ట్రాజెనెకా​ను తొలి డోసుగా తీసుకుని.. ఫైజర్​, మోడెర్నాలో ఒకదానిని రెండో డోసుగా తీసుకుంటే.. మరింత రక్షణ లభిస్తోందని డెన్మార్క్​ ప్రకటించింది.

  • జర్మనీ..

దేశంలోని బడుగు బలహీన వర్గాలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రజల కోసం జర్మనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి డోసు ఏది తీసుకున్నా.. రెండో డోసు మాత్రం ఫైజర్​/ మోడెర్నాను(ఎమ్​-ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​) బూస్టర్​ డోసుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్​ నుంచి మొదలుకానుంది.

  • దక్షిణ కొరియా..

ఆస్ట్రాజెనెకా రెండు డోసులకన్నా.. రెండో డోసుకు ప్రత్యామ్నాయంగా ఫైజర్​ ఇస్తే.. రోగనిరోధక శక్తి.. సాధారణం కన్నా 6 రెట్లు పెరిగిందని తమ పరిశోధనల్లో తేలినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది.

  • థాయ్​లాండ్​..

థాయ్​లాండ్​లో.. సినోవాక్​ను తొలి డోసుగా.. ఆస్ట్రాజెనెకాను రెండో డోసుగా ఇస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతోందని వెల్లడించారు. చైనాకు చెందిన ఓ టీకాను.. ఇతర టీకాలతో కలుపుతుండటం ఇదే తొలిసారి.

  • కెనడా..

కెనడాకు చెందిన జాతీయ భద్రతా కమిటీ కూడా రెండు వేర్వేరు టీకాల డోసులకు అనుమతినిచ్చింది. ఆస్ట్రాజెనెకా/ కొవిషీల్డ్​ను తొలి డోసుగా తీసుకున్న వారు.. రెండో డోసుగా ఎమ్​-ఆర్​ఎన్​ఏ టీకాలు పొందవచ్చని పేర్కొంది.

  • స్పెయిన్​..

ఆస్ట్రాజెనెకా టీకాను తొలి డోసుగా తీసుకున్న అనంతరం ఎమ్​-ఆర్​ఎన్​ఏ టీకాలను రెండో డోసుగా తీసుకోవచ్చని స్పెయిన్​ బయోఎథిక్స్​ కమిటీ ప్రకటించింది. రెండో డోసు తీసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొంది.

జాగ్రత్తగా ఉండాలి..

పరిశోధనలు పూర్తిస్థాయిలో జరిగి.. ఫలితాలు వెలువడేంత వరకు.. టీకాల మిశ్రమ డోసులు తీసుకునే ఆలోచనను విరమించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(vaccine mixing covid WHO) హెచ్చరించింది. అయితే ప్రాథమిక సూత్రాలను పరిగణిస్తే.. రెండు వేరు వేరు టీకాల డోసుల వ్యూహం ఫలిస్తుందని అభిప్రాయపడింది. ఏదిఏమైనా.. సరైన డేటా బయటకు వచ్చేంత వరక వేచిచూడాలని పేర్కొంది.

ప్రయోజనాలు ఎన్ని?

వ్యాక్సిన్ల కొరత ఏర్పడినప్పుడు ఈ వ్యూహం ఉపయోగపడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఒకే రకం టీకా కోసం ఎదురుచూడకుండా.. అందుబాటులో ఉండే వ్యాక్సిన్లను వెంటనే తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనితో పాటు రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందనే విశ్వాసంతో ఉన్నాయి.

ఇదీ చూడండి:- వ్యాక్సిన్​ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.