మధుమేహం అదుపులో ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!

author img

By

Published : Aug 29, 2021, 4:01 PM IST

Must haves to follow for diabetes under control

షుగర్​తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఎక్కడ షుగర్​ పెరుగుతుందోనని స్వీట్లు, పండ్లు సహా అన్నం కూడా తినడం మానేస్తుంటారు. చివరికి చపాతీలు, రాగి ముద్దలు తినడానికే మొగ్గుచూపుతారు. అయితే షుగర్​ వ్యాధి ఉన్నప్పటికీ ఆహారం తీసుకోవడంలో కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కడుపునిండా తింటూనే రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారి నుంచి తెలుసుకోండి.

షుగర్​ వ్యాధి.. పేరులోనే తీపి. ఒకసారి దీని బారిన పడితే ఇక జీవితమంతా చేదే! రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులు మింగాల్సిందే. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోని భోజనాన్ని చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమను కలిగిస్తుండాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే షుగర్​తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలో.. ఏం తినకూడదో..? అన్న అనుమానాలు చాలా మందిని వేధిస్తుంటాయి. నిజానికి అన్ని రకాల ఆహారాలు తీసుకుంటూనే.. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

తినాల్సినవి/ చేయాల్సినవి

  • పాలు, పాలతో చేసి వంటకాలు, ధాన్యం (సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు), మరమరాలు సేమ్యా వంటి వాటిని తరచుగా తీసుకోవచ్చు.
  • నిమ్మ, దానిమ్మ, ఉసిరి, జామ, బొప్పాయి, యాపిల్​ వంటి పండ్లు మధుమేహాన్ని నియంత్రణలో. వీటిని తరచూ తీసుకోవాలి.
  • వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలి.
  • మధుమేహ బాధితులు నిత్యం రాగి ముద్దను తీసుకోవడం మేలు. మొలకెత్తిన రాగులు తినడం కూడా మంచిదే. వీటిలో సీ విటమిన్​, కాల్షియంతో పాటు పీచు పదార్థం కూడా ఉంటాయి.
  • జొన్న పేలాలు, జొన్న రొట్టెలు, వేడి వేడి మొక్కజొన్న గింజలు షుగర్ వ్యాధిగ్రస్థులకు చాలా మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవాలి.
  • ప్రతిరోజు పండిన తాజా బొప్పాయి పండుని భోజనం తర్వాత నేరుగా గానీ, తేనెతో కలుపుకుని గానీ తినాలి.
  • అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు. పాలిష్​ పట్టించని బియ్యాన్ని వండుకుని తినవచ్చు. లేదా పాత బియ్యాన్ని వండుకుని తినవచ్చు. వీటితో పాటు గోధుమ, సజ్జలు, రాగులు, జొన్నలు వంటి ధాన్యాలను తరచుగా తీసుకోవాలి.
  • కాయకూరలు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆహారం పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. నిర్ణీత సమయాల్లో భోజనం చేయాలి.
  • అరటి, సపోటా, సీతాఫలం సహా ద్రాక్షలను తగ్గించి తీసుకోవాలి. అది కూడా షుగర్​ లెవెల్స్​ను చూసుకుని తీసుకోవాలి. షుగర్​ శాతం అధికంగా ఉంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
  • షుగర్​ ఉన్నవాళ్లు కూడా వాళ్ల ఆహారంలో రోజూ ఒక ఫలాన్ని తీసుకోవచ్చు. జామా, బొప్పాయి, దానిమ్మ పుచ్చకాయ లాంటివి కచ్చితంగా యాడ్​ చేసుకోవాలి.
  • శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి.

మెంతులు మధుమేహులకు వరం!

మెంతుల్ని మధుమేహులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. మెంతుపొడి బ్లడ్​షుగర్​, బ్లడ్​ కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో సమర్థంగా పని చేస్తుంది. రోజుకు 25 గ్రాముల మెంతులు- మధ్యాహ్నం భోజనానికి ముందు 12.5 గ్రాములు, రాత్రి భోజనానికి ముందు 12.5 గ్రాములు వాడాలి. మెంతుపొడి తీసుకున్న 15-20 నిమిషాల్లో భోజనం చేయాలి. ఇది చక్కెర వ్యాధులకు వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది.

ఇవి చేయకూడదు.. తినకూడదు

  1. ఆహారంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించాలి.
  2. తీపి వస్తువులు తినడం పూర్తిగా మానేయాలి.
  3. అన్నం మోతాదు తగ్గించాలి.
  4. విందులు, ఉపవాసాలు పనికి రావు.
  5. తియ్యని పిండి పదార్థాలు, వేపుడు వంటకాలను బాగా తగ్గించాలి.

ఇదీ చూడండి: Health Tips: పంచదారకు ప్రత్యామ్నాయాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.