ETV Bharat / state

Errabelli: గంగదేవిపల్లిని మించేలా.. పల్లెలను రూపుదిద్దాలి

author img

By

Published : Jun 30, 2021, 4:33 PM IST

minister errabelli dayakar rao
పల్లెప్రగతిపై దిశానిర్దేశం

పల్లె ప్రగతి( Palle Pragathi ) నిరంతర ప్రక్రియని... గ్రామాలు పూర్తిగా బాగుపడేవరకూ ఇది కొనసాగుతూనే ఉంటుందని... మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేలా... స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. పట్టణాలకు దీటుగా... గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్లె ప్రగతి( Palle Pragathi ), పట్టణ ప్రగతి ( Pattana Pragathi ) అమలు కోసం యంత్రాంగం సిద్ధమవుతోంది. జులై 1 నుంచి జరగనున్న కార్యక్రమాలను పక్కాగా చేపట్టేలా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షలు జరిపి... గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం, మెరుగైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మరో విడత పల్లె, పట్టణ ప్రగతికి రంగం సిద్ధమైంది. వరంగల్ గ్రామీణ జిల్లాకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు( Minister Errabelli Dayakar Rao )తో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పది రోజుల పాటు చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతిని మొక్కుబడిగా కాకుండా.. చిత్తశుద్ధితో చేయాలని విజ్ఞప్తి చేశారు. పల్లెటూళ్లే మన భాగ్యసీమలని.. అవి బాగుంటేనే రాష్ట్రమూ బాగుంటుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని గ్రామాలు, పట్టణాలు పూర్తిగా బాగుపడేవరకూ ఇది కొనసాగుతుందని ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని పల్లెలను గంగదేవిపల్లి( Gangadevipalli ) లాంటి ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా..

చెత్తా చెదారం తొలగించడం, అన్ని రహదార్లను శుభ్రపరచడం, గుంతలు పూడ్చివేయడం, పాడుపడిన నిర్మాణాలను తొలగించడం, మురుగు కాలువలు శుభ్రపరచడం, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు శుభ్రపరచుకోవడం, పిచ్చి మొక్కలు తొలగించడం, తడిచెత్త, పొడిచెత్త వేరుగా ఉంచేలా ఇంటివారికి అవగాహన కల్పించడం, దోమల నివారణకు, మురుగు నీరు తొలగింపు, నల్లాలకు సంబంధించి అన్ని లీకేజీలు సరిచేయుట, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు లేని చోట వెంటనే నిర్మించడం మొదలైనవి ఈ కార్యక్రమంలో చేపడతారు.

ప్రజలకు అవగాహన కల్పించండి..

ఇంటికి ఆరుమొక్కల చొప్పున పంపిణీ చేయడం, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయడం, పవర్ డేలో భాగంగా... ఒరిగిపోయిన స్తంభాలు తొలగించుకోవడం, వేలాడే తీగలు తొలగించి... కొత్తవి వేసుకోవడం మొదలైనవి పది రోజులపాటు చేయాల్సిన కార్యక్రమాలుగా నిర్ణయించారు. పది రోజుల పాటు చేపట్టాల్సిన కార్యాచరణను మంత్రి దిశానిర్దేశం చేశారు. గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో గ్రామాలు బాగుపడ్డాయని... సర్పంచులకు పేరొచ్చిందని అన్నారు. సర్పంచులు, కార్యదర్శుల పర్యవేక్షణ వల్లే ఉపాధి హామీ పథకంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్​గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో చెత్తా లేకుండా యజమానులకు అవగాహన కల్పించాలని... వినకుంటే పంచాయతీ స్థలాలుగా బోర్డులు పెట్టాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలను ఎంపిక చేసి పారితోషికాలందిస్తామని మంత్రి తెలిపారు.

రోజూవారీ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి గ్రామసభ నిర్వహించాలని అన్నారు. దాతలను ప్రోత్సహించి వారి పేర్లను బోర్డుల్లో పెట్టాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా... చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి: భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.