మూడు వారాలైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని నిరసిస్తూ రోడ్డుపై ధాన్యం బస్తాలు తగులబెట్టారు రైతులు. వరంగల్ గ్రామీణజిల్లా సంగెం మండలం చింతలపల్లిలో అన్నదాతలు అర్ధరాత్రి ధాన్యం బస్తాలు రోడ్డుకు ఇరువైపులా వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ధాన్యం బస్తాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేసారు.
కలెక్టర్ వెంటనే స్పందించి తమ ధాన్యాన్ని త్వరగా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ముంచుకొస్తున్న వర్షాల భయంతో తాము ఇళ్లకు వెళ్లకుండా కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో కొనుగోళ్లు జరిపి ఆదుకోవాలని రైతన్నలు వేడుకొంటున్నారు.