CM KCR Wanaparthy Tour: నేడే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం

author img

By

Published : Mar 8, 2022, 4:32 AM IST

CM KCR Wanaparthy Tour: నేడే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం

CM KCR Wanaparthy Tour: సర్కారీ బళ్ల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయ తలపెట్టిన 'మన ఊరు- మన బడి' కార్యక్రమానికి సర్కారు నేడు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పథకానికి సంబంధించిన పైలాన్​ను ఆయన ఆవిష్కరించనున్నారు. దాంతో పాటు వనపర్తిలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్, నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. వనపర్తిలో నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

CM KCR Wanaparthy Tour: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయతలపెట్టిన 'మన ఊరు- మనబడి, మనబస్తీ- మనబడి' కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందుకు వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేదిశగా మనఊరు-మనబడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సర్కారీ బళ్లలో ఆంగ్లమాధ్యమ విద్యాబోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద రూ.7,289 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 9వేల123 పాఠశాలల్ని ఎంపిక చేశారు. 3వేల497 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.

సీఎం కేసీఆర్​ పర్యటన ఇలా..

ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం వెళ్లనున్న కేసీఆర్ అక్కన్నుంచి హెలికాప్టర్​లో వనపర్తి జిల్లా పర్యటనకు రానున్నారు. ముందుగా వనపర్తి మండలం చిట్యాల వ్యవసాయ మార్కెట్​లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​కు చేరుకుంటారు. అక్కడే నూతనంగా నిర్మించిన వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అక్కన్నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుని మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వనపర్తి తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజనానంతరం కలెక్టరేట్ నుంచి బయలుదేరి పక్కనే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్​లో హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు.

బహిరంగ సభకు భారీగా జనం

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెరాస భారీ జనసమీకరణ చేయనుంది. ఇప్పటికే వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్ నియోజక వర్గాల నుంచి జనాన్ని తరలిచేందుకు అధికారపార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్షా 20వేల వరకూ జనాన్ని సమీకరించాల్సిందిగా లక్ష్యం పెట్టుకున్నారు.వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించాల్సి ఉండగా రెండుసార్లు సీఎం పర్యటనలు రద్దయ్యాయి. ఇవాళ్టికి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో సభను దిగ్విజయం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నారు.

భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 1840మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. వారిని 16 సెక్టార్లుగా విభజించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గద్వాల్, అయిజ, అలంపూర్, పెబ్బేరు వైపు నుంచి వచ్చే వారికి 80ఫీట్ల రోడ్డు ఎడమవైపున, నాగర్ కర్నూలు, అచ్చంపేట కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి నుంచి వచ్చే వారికి సూర్యచంద్ర స్కూలు వెనకాల, దేవరకద్ర,మక్తల్,నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, ఆత్మకూరు, కొత్తకోట వైపు నుంచి వచ్చేవారికి తెలంగాణ భవన్ వెనకాల, మనఊరు-మనబడి కార్యక్రమానికి వచ్చే వారికి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.