ETV Bharat / state

వైభవంగా పెద్దగట్టు జాతర.. చంద్రపట్నం వేడుకలో పాల్గొన్న మంత్రి జగదీశ్

author img

By

Published : Feb 7, 2023, 5:39 PM IST

Lingamantula Swami Jatara
Lingamantula Swami Jatara

PEDDAGATTU JATHARA: సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్​పల్లి వద్ద గల పెద్దగట్టుపై కొలువై భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లింగమంతుల స్వామి జాతర కన్నులపండువగా జరుగుతోంది. అధిక సంఖ్యలో భక్తులు గుట్టపై ఉన్న స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ చంద్రపట్నం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.

PEDDAGATTU JATHARA: సూర్యాపేట జిల్లా పెద్దగట్టుపై కొలువుతీరిన లింగమంతుల స్వామి జాతరకు విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. జాతర మూడో రోజైనా ఇవాళ ప్రధాన ఘట్టమైన చంద్రపట్నం వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబానికి ఘన స్వాగతం పలికి.. వారిని సత్కరించారు.

స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు అనంతరం మట్లాడిన మంత్రి ఇప్పటి వరకు 13లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. మరో 5లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

గతంలో నిర్లక్ష్యంలో ఉన్న జాతరలు, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రస్తుత ప్రభుత్వంలో గౌరవం అందుతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పెద్దగట్టు అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక నాలుగు జాతరలకు గాను రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి ప్రకటించారు.

"కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో కనుమరుగైన జాతరలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేయడం జరుగుతోంది. పెద్దగట్టు జాతరకు ఇంత వరకు 13లక్షల మంది భక్తులు వచ్చారు. మరో 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. రాష్ట్రంలో పాడి పంటలు బాాగా పండి రైతులందరూ సంతోషంగా ఉండాలని.. వచ్చే సంవత్సరం కూడా ఇంతే వైభవంగా జాతర జరుపుకోవాలని స్వామి వారిని కోరుకున్నాను".- జగదీశ్ రెడ్డి, విద్యుత్​శాఖ మంత్రి

చంద్రపట్నం కార్యక్రమం: జాతరలో ముఖ్య ఘట్టమైన చంద్రపట్నం వేడుక ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు లింగమంతుల స్వామి, మాణిక్యమ్మ అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. ఆలయ వంశపారంపర్య పూజారులు మున్న, మెంతబోయిన వంశస్థులు కళ్యాణ వస్తువులు తీసుకురాగా వారి చేతుల మీదుగా కళ్యాణం తంతుని చేయించారు.

మొదటగా హక్కుదారుల సమక్షంలో బైకాని వారు సాంప్రదాయ వాయిద్యాల నడుమ చందనం, పసుపు కుంకుమతో దీర్ఘచతురస్రాకారంలో 16 గదుల చంద్రపట్నం వేసి దాని మీద దేవతా మూర్తులు ఉన్న దేవరపెట్టెను పెట్టారు. చంద్రపట్నం ముందు బైరవ పోతురాజులకు బియ్యం పాలు పోసి వాటిపై నువ్వులనూనెతో దీపాలు పెట్టి.. బైకాని పూజారులు గొల్ల కులం పుట్టుకతో పాటు లింగమంతుల స్వామి చరిత్రను ఆలపిస్తూ దేవరపెట్టెలోని లింగమంతుల స్వామి, మాణిక్యమ్మ అమ్మవార్లకు కళ్యాణం జరిపించారు.

వైభవంగా పెద్దగట్టు జాతర.. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి జగదీశ్​రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.