ETV Bharat / state

Mallanna sagar rehabilitation: స్థలం ఇవ్వలేదు.. అద్దె కట్టలేదు.. ఉపాధి లేదు.!

author img

By

Published : Dec 1, 2021, 10:37 AM IST

వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్‌ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. సర్వం కోల్పోయినా తమ గోడు వినే నాథులే కరవయ్యారని బాధపడుతూ వారంతా కాలం వెళ్లదీస్తున్నారు.

Mallanna sagar rehabilitation
మల్లన్న సాగర్​ భూ నిర్వాసితులు

Mallanna sagar rehabilitation: సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్​ జలాశయం నిర్మాణంతో ఎనిమిది పంచాయతీల పరిధిలో 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6,581 కుటుంబాలు ఉండగా, అందులో 2,500 కుటుంబాలకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధి సంగాపూర్‌లో 600 ఎకరాల్లో రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొండపాక మండలం ఎర్రవల్లి, సింగాటంలో మరికొందరికి స్థలాలు ఇచ్చారు. కట్టిన ఇంటికి బదులు.. స్థలం కావాలని కోరుకున్న వారికి గజ్వేల్‌ పరిధిలో 250 గజాల చొప్పున కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వాటిలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు అందజేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎవరి స్థలం ఎక్కడుందో ఇప్పటివరకూ చూపించలేదని బాధితులు వాపోతున్నారు.

ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్థులకు కేటాయించబోయే స్థలంలో అసంపూర్తిగా ఉన్న సిమెంటు రోడ్డు పనులు

ఎన్నాళ్లిలా

Mallanna sagar project expatriates: ఇళ్లు లేని వారంతా తాత్కాలికంగా గజ్వేల్‌ పట్టణంలో పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవీ నిండిపోవడంతో, మిగిలిన వారిని అద్దె ఇళ్లలో ఉండేలా ఒప్పించారు. అద్దె కింద ఆరు నెలలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

నిర్వాసితులు తాత్కాలికంగా ఉంటున్న రెండు పడక గదుల ఇళ్లు

‘‘మమ్మల్ని గ్రామం నుంచి తరలించే సమయంలో పదిహేను రోజుల్లో స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఆరు నెలలు గడిచినా కేటాయింపు మాటెత్తడం లేదు. మొత్తం 920 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. 450 కుటుంబాలకు అద్దె సొమ్ము కూడా ఇవ్వలేదు. వ్యవసాయాధారంగా జీవించిన మేమంతా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యాం. అద్దె సొమ్ము ఎలా చెల్లించగలం’ అని బాధితులంతా ఆవేదన వ్యక్తంచేశారు. పరిహారం ఆలస్యం అవుతోందనే వ్యధతో నాలుగు నెలల క్రితం రైతు బానోతు హన్మంతు చనిపోయాడని తెలిపారు.

నిర్వాసితుల జాబితా

నిర్వాసితుల గోడు

కుటుంబ పోషణ భారమైంది

ముంపులో 15 ఎకరాల సాగు భూమి కోల్పోయానని ఏటిగడ్డ కిష్టాపూర్​ వాసి ఎల్దండి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి గజ్వేల్‌లో అద్దెకు ఉంటున్నానని.. ఇంతవరకూ ఇంటి స్థలం ఇవ్వలేదని.. అద్దె సొమ్ము చెల్లించలేదని వాపోయారు. నెలకు రూ.6 వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నానని.. ఇక్కడ పని దొరకక కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పనిలేక ఇబ్బంది

జలాశయం నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోయినట్లు గ్రామానికి చెందిన బండి యాదగిరి చెప్పారు. తాత్కాలికంగా గజ్వేల్‌ పట్టణ పరిధిలో రెండు పడక గదుల ఇంటిలో ఉంటున్నానని అన్నారు. ఊరు ఉన్నపుడు మూడెకరాల్లో వ్యవసాయం చేసేవాడినని.. ప్రస్తుతం ఏ పనీ లేకపోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని ఆవేదన వెలిబుచ్చారు. కనీసం స్థలమైనా త్వరగా కేటాయిస్తే ఇల్లు కట్టుకుని, ఏదో ఒక పని వెతుక్కుంటామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం

నిర్వాసితుల సమస్యలపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని 'ఈటీవీ భారత్​' వివరణ అడగగా త్వరలోనే వారికి స్థల కేటాయింపులు చేస్తామని చెప్పారు.

మల్లన్న సాగర్‌ జలాశయం నిర్వాసితులకు గ్రామాలవారీగా స్థలాలు కేటాయించాలని నిర్ణయించాం. వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. త్వరలో స్థల కేటాయింపులు పూర్తిచేస్తాం. నిర్వాసితులెవరూ ఆందోళన చెందొద్దు. త్వరలో అద్దె సొమ్ము కూడా చెల్లిస్తాం. - అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట

ఇదీ చదవండి: paddy procurement: నెలల తరబడి పడిగాపులే.. కర్షకులకు తప్పని కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.