Siddipet collector resigns: ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో తెరాసలోకి!

author img

By

Published : Nov 15, 2021, 2:29 PM IST

Updated : Nov 15, 2021, 4:50 PM IST

Siddipet Collector Venkatramireddy resigns

14:28 November 15

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా

ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. తెరాసలో చేరే అవకాశం

ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (siddipet collector Venkata rami reddy resign news) రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు (CS SOMESH KUMAR) రాజీనామా లేఖ అందించారు. త్వరలోనే వెంకట్రామిరెడ్డి తెరాసలో చేరే అవకాశముంది. తెరాస.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

వెంకట్రామిరెడ్డి ప్రస్థానం

వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ సర్వీస్‌ల్లో వెంకట్రామిరెడ్డి (Venkata rami reddy ) చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగానూ, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా పని చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పనిచేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ చేశారు వెంకట్రామిరెడ్డి.

అందుకే రాజీనామా

తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించినట్లు​ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 26 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వాల్లో పనిచేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక తెరాసలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ (CM KCR) చేస్తున్న అభివృద్ధి పనుల్లో తాను పాలుపంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని తెలిపారు.

నా రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. 26 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వాల్లో పనిచేశా. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక తెరాసలో చేరతా. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తా..

                                       - వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్​

వివాదాల్లో వెంకట్రామిరెడ్డి

ఇటీవల కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి(siddipet collector Venkata rami reddy) హెచ్చరించారు. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేశారు.  అంతకు ముందు మరో వివాదంలో కూడా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి ఇరుక్కున్నారు. సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్‌ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశమైంది. కలెక్టర్​ అయి ముఖ్యమంత్రి కాళ్లపై పడటంపై విపక్షాలు, ప్రజలు మండిపడ్డారు. 

వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలివే...

"జిల్లాలో వరి విత్తనం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరితో ఫోన్ చేయించినా.. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా.. ఊరుకోను. అలా చేస్తే మూణ్నెళ్లు ఆ దుకాణం మూసివేస్తాం. జిల్లాలో ఉన్న 350 దుకాణాల్లో కిలో వరి విత్తనాలు విక్రయించినా.. దుకాణం మూసివేస్తాం. నేను కలెక్టర్​గా ఉన్నంత వరకు ఆ దుకాణం మూసివేసే ఉంటుంది. అది కాకుండా ఇంకే వ్యాపారం చేసినా ఊరుకోను. అందుకే విత్తన డీలర్లెవరు వరి విత్తనాలు విక్రయించొద్దు."

-  వెంకటరామిరెడ్డి, సిద్దిపేట కలెక్టర్

హైకోర్టు ఆగ్రహం...

వరిసాగుపై వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసింది. వరి విత్తనాలమ్మితే చర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ తీరుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సిద్దిపేట జిల్లాలో వరి విత్తనాల విక్రయాల్లో వెంకట్రామిరెడ్డి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యల కోసం సీజే ధర్మాసనానికి పంపించాలని రిజిస్ట్రార్​ను ఆదేశించింది. 

Last Updated :Nov 15, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.