అట్టహాసంగా కొమ్మరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. అగ్నిగుండాలను దాటిన భక్తులు

author img

By

Published : Jan 23, 2023, 5:59 PM IST

Komaravelli Mallikarjuna Swami Brahmotsavalu

Komaravelli Mallikarjuna Swami Brahmotsavalu: శివసత్తుల శంఖారావ ధ్వనులు, పోతురాజుల నృత్యాలు, మల్లన్న స్వామిని స్మరిస్తూ అగ్నిగుండాలు దాటుతున్న భక్తులతో కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం పసుపువర్ణంగా మారిపోయింది. వేలాది మంది భక్తులరాకతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

అట్టహాసంగా కొమ్మరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

Komaravelli Mallikarjuna Swami Brahmotsavalu: భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం, కొండసారికాల్లో వెలసిన కోరమీసాల మల్లన్న క్షేత్రం భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. శివసత్తుల శంఖారావ ధ్వనులు, పోతురాజుల ఆటపాటలతో సిద్ధిపేట జిల్లాలో వెలిసిన శ్రీ కొమరవెల్లి మల్లికార్ఖున స్వామి దేవాలయం పసుపువర్ణంగా మారిపోయింది. తెలంగాణ అంటేనే జానపద నృత్యాలకు, ఒగ్గు కళలకు, సంప్రదాయలకు పుట్టినిల్లు. అలాంటి సంస్కృతి మొత్తం మల్లన్న దేవాలయం వద్ద కనిపిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో మల్లన్న స్మరణతో భక్తులతో నిండిన దృశ్యాలు చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు.

స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రధాన ఘట్టమైన అగ్ని గుండాల కార్యక్రమం పోలీసుల బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే ఈ ఉత్సవాలు హైదరాబాద్​కు చెందిన యాదవులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వీరశైవ అర్చకులు మల్లన్న, మెడలమ్మ, కేతమ్మల ఉత్సవ విగ్రహాలతో తోటబావి వద్ద నిర్వహించే అగ్ని గుండాలను తొక్కడం ప్రారంభించారు. అనంతరం భక్తులు, శివసత్తులు, పోతురాజులు అగ్నిగుండాలను దాటుతూ మల్లన్నను స్మరించారు.

అగ్ని గుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఆలయ తోటబావి వద్ద సమీదలను (కట్టెలను) కుప్పగా పేర్చి మల్లన్నను స్మరిస్తూ 21 వరుసలతో చిన్న పట్నాన్ని రచిస్తారు. పట్నంలో బలిజ మేడలమ్మ, గోళ్ల కేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబిస్తోంది.

"ఈ మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నంలో మల్లన్న లగ్నం అయ్యాక.. అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ అగ్ని గుండాల్లో పాల్గొన్న భక్తులు గాని చూసిన వారికి మంచి ఆరోగ్యం, సంపాదనతో పాటు మనశ్శాంతి దొరుకుతోందని భక్తులు విశ్వాసం. అందుకే చాలా మంది భక్తులు ఇక్కడకి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు."- స్థానిక భక్తుడు

"మేము హైదరాబాద్​ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ కార్యక్రమం మాకు చాలా ప్రత్యేకం. సంక్రాంతి పండగ మొదలుకొని ప్రారంభమయ్యే ఈ పండగ మా ఒగ్గు కళాకారులు, యాదవులు చాలా నియమ, నిబంధనలతో పండగ చేస్తాం. మల్లన్న కళ్యాణం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ అయ్యవారికి బోనాలు ఇచ్చి కొండపోచమ్మ దగ్గర మొక్కులు తీర్చుకున్న తర్వాతనే హైదరాబాద్​కు​ వెళ్తాం".- భక్తుడు హైదరాబాద్​ వాసి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.