సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు చిట్ల కార్తిక్, కుందన్ లాక్డౌన్ సమయంలో ఏమీ తోచక తమకు వచ్చిన కళకు సానపెట్టడం మొదలు పెట్టారు. కాలక్షేపానికి బొమ్మలు గీసే వీరు.. లాక్డౌన్లో శ్రద్ధగా తమ కళను మరింత అభివృద్ధి చేసుకున్నారు. పదో తరగతి చదివే కార్తిక్, ఇంటర్ చదివే కుందన్.. వారి సోదరుడు శ్రీనాథ్ స్ఫూర్తితో చిత్రకళపై ఇష్టాన్ని పెంచుకున్నారు.
దేవుళ్లతో షురూ..
మొదట్లో దేవుళ్ల ఫొటోలు గీసేవారు.. తర్వాత వివిధ రకాలు చిత్రాలు వేయడం ప్రారంభించారు. ఒకరికొకరు చిత్రాలు పంపించుకుంటూ.. ఎవరు బాగా గీస్తారో అని సవాల్ విసురుకునేవారు. కొన్ని రోజుల అనంతరం ఏం చిత్రాలు గీయాలో అర్థంగాక తర్జనభర్జనపడ్డారు. అప్పుడే వారికి ఓ ఐడియా వచ్చింది. ప్రముఖుల చిత్రాలు గీయాలని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
ప్రముఖుల చిత్రాలు..
అప్పటి నుంచి కార్తిక్, కుందన్లు.... సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, రియల్ హీరో సోనూసూద్, రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు చిత్రాలు గీశారు. వీరితో పాటు కరోనా కష్టకాలంలో ప్రాణాలొడ్డి ప్రజలకు సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ బొమ్మలను వేశారు. ఇలా దాదాపు 70 బొమ్మలు వేసిన ఈ సోదర ద్వయం.. 200 చిత్రాలు గీయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఆనందమానందం..
తమ కుమారుల ప్రతిభ చూసిన తల్లిదండ్రులు ముచ్చటపడిపోతున్నారు. వీరు గీసిన బొమ్మలను చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారని సంబురపడిపోతున్నారు. ఈ సోదరులు గీసిన చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారి తండ్రి శివ తెలిపారు. పాఠశాలలో పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో బహుమతులు గెలుచుకునేవారని చెప్పారు. తాను ఓ చిరుఉద్యోగి అయినందున.. తన కుమారులు గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయడం కష్టమని.. ఎవరైనా దాతలు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.
సాయం కావాలి..
లాక్డౌన్ సమయాన్ని ఆటలు ఆడుకోవడానికో, సినిమాలు చూడటానికో కాకుండా ఇలా అర్థవంతంగా ఉపయోగించడం నిజంగా అభినందనీయమని పలువురు అంటున్నారు. కార్తిక్, కుందన్ల ప్రతిభను గుర్తించి.. వారు గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే.. వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.