ETV Bharat / state

paddy procurement in telangana: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల అవస్థలు

author img

By

Published : Nov 7, 2021, 1:10 PM IST

ధాన్యం కొనుగోళ్లలో(paddy procurement in telangana) జాప్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా కేంద్రాలు తెరవలేదు. ప్రారంభించిన చోట కొనుగోళ్లు మొదలవలేదు. ఫలితంగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈసారి దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోలేదు. జిల్లాలోని వివిధ మండలాల్లోని పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

paddy procurement in telangana, farmers problems
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతులకు తప్పని కష్టాలు

సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదు. రికార్డు స్థాయిలో ఈసారి దిగుబడి వచ్చినా... వడ్లు అమ్ముకునేందుకు(paddy procurement in telangana) రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఈ సారి 151 చోట్ల కొనుగోలు కేంద్రాలు(paddy procurement in telangana) ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికే 125 చోట్ల వాటిని ప్రారంభించామని పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్రాలు పేరుకే ఏర్పాటు చేసినా... కొనుగోళ్లు మొదలు పెట్టలేదని రైతులు వాపోతున్నారు. అందోల్, కల్హేర్, పుల్కల్, చౌటకూర్ మండలాల్లో రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాన కురిస్తే అంతే..

కల్హేర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే అయిదు రోజుల క్రితం కేంద్రం ప్రారంభించారు. కానీ ఇక్కడ కొనుగోళ్లు మొదలు కాలేదు. చాలా చోట్ల కోతలు మొదలై చాలా రోజులైనా ఇంకా కేంద్రాలు తెరవని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా చోట్ల రహదారుల పొడవునా ధాన్యం కనిపిస్తోంది. మంచు కురుస్తుండటంతో రోజూ ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి కుప్ప చేయడం పనిలోనే రైతులు నిమగ్నమవుతున్నారు. వాన పడితే నోటికందే కూడు నీళ్ల పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు.

మేం వరికోసి 20 రోజులు అవుతోంది. ఇక్కడ ఎండబోశాం. ఇవాళే టోకెన్లు ఇచ్చారు. వర్షం వస్తదేమోనని భయమేస్తుంది. జర తొందరగా కొనుగోలు చేయాలి. ఇంకా రైస్ మిల్లులకు వరిమిషన్లు రాలేదని చెబుతున్నారు. అదంతా పూర్తి చేసి తొందరగా కొనాలని కోరుతున్నాం.

- మల్లేశం, రైతు

నాలుగు సంవత్సరాల నుంచి ఆందోల్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేవాళ్లు. కానీ ఈసారి మాత్రం లేదు. మేం అధికారులను అడిగితే... ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు చేయలేదు. రైతులంతా కూడా 15-20 లోడుల వరి ధాన్యాన్ని అక్కడక్కడా కుప్పలు పోసి.. ఆరబోశారు. వడ్లు కూడా బాగా ఎండినయి. జోగీపేట నుంచి కనీసం సంచులు ఇవ్వమన్నా ఇస్తలేరు. అక్కడికి ధాన్యం తీసుకెళ్దామంటే మార్కెట్​లో ప్లేస్ లేదు.

-మధుసూదన్ రెడ్డి, రైతు

వడ్లు ఎండబోసి పదిహేను రోజులవుతోంది. వర్షం వచ్చి తడిసిపోయినయి. మా దగ్గర కొనుగోలు కేంద్రం లేదు. కూలీల, ఖర్చులకు పోనూ మాకు ఏం మిగలడం లేదు. వడ్లు చాలా ఖరాబ్ అవుతున్నాయి. తడిసిపోయేవి తడుస్తున్నాయి. ఇంకాకొన్ని పాడవుతున్నాయి. మా దగ్గర కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇక్కడికి తీసుకురావాలంటే పెట్రోల్ ధరలకే చాలా ఖర్చు అవుతుంది.

-శ్రీనివాస్, రైతు

నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ధాన్యం కోసి పది రోజులు అవుతోంది. ఎండకు వడ్లు బాగా ఎండినయ్. వానపడితే మా పరిస్థితి ఇప్పుడు ఘోరం. యాసంగిలో ఇచ్చినట్లు మాకు కూడా కాంటా ఇవ్వాలి. కౌలు ఏం కట్టాలి? కూలీలకు ఏం ఇవ్వాలి? మాకు ఏం మిగులతాయి? ధాన్యం తొందరగా కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-నాగయ్య, రైతు

త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుల తరబడి పిల్లాపాపలతో కేంద్రాల వద్ద నిరీక్షించే బాధ తప్పించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: cyber crime complaint: అధిక లాభాల ఆశ చూపి.. నిండా ముంచేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.