దక్షిణ కాశీగా పేరుగాంచిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ అమృతగుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తున్నారు. శివ మాల ధారణ పూర్తిచేసుకున్న శివ భక్తులు ఇరుముడి సమర్పించి మాల విరమణ ఘట్టాన్ని పూర్తి చేసుకుంటున్నారు. కొవిడ్ వ్యాప్తి వల్ల ఆలయ అధికారులు భౌతిక దూరం పాటించేలా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.