ETV Bharat / state

RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

author img

By

Published : Aug 22, 2021, 1:53 PM IST

Updated : Aug 22, 2021, 2:56 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రక్షా బంధన్​ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. అక్కాచెల్లెల్లు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి తమ జీవితంలో వారెంత ముఖ్యమో చెబుతున్నారు. ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నాతమ్ముళ్లు వారి తోబుట్టువులకు భరోసానిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నాయకులను సోదరులుగా భావిస్తూ మహిళా కార్యకర్తలు, సోదరీమణులు రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు.

rakhi pournami celebrations
రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు

సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్.. ఒక కొమ్మన పూచిన పూవుల్లాంటి తోడబుట్టిన వాళ్ల రక్తసంబంధం ఔన్నత్యాన్ని తెలిపే పండుగ రాఖీ. రక్తసంబంధం గొప్పతనాన్ని తెలియజేసే పండుగ ఏదైనా ఉందీ అంటే అది ఇదే. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆడపడుచులతో మంత్రి హరీశ్​..

ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెల్ల అనుబంధం, ఆప్యాయతకు ప్రతిరూపం రక్షాబంధన్‌ అని హరీశ్​ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు అతిథిగృహంలో మంత్రి హరీశ్​ రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లను జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గందె రాధిక, ఎంపీపీలు కలిశారు. వారికి మంగళహారతులు ఇచ్చి తిలకం దిద్దారు. రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు. హుజూరాబాద్‌ చెల్లెల్ల మధ్య రాఖీ జరుపుకోవటం సంతోషంగా ఉందని హరీశ్​ అన్నారు.

అనంతరం హుజూరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తూ హరీశ్​ రావు హుస్నాబాద్​లో ఆగారు. అక్కన్నపేట జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ.. హరీశ్​కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సిద్దిపేటకు వెళ్లారు.

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు

వేడుకల్లో పాల్గొన్న తలసాని..

రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. రక్షాబంధన్​ను పురస్కరించుకొని వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. ఆయన సోదరీమణులు రమాదేవి, విజయ రాణి, లక్ష్మీ బాయ్​లు మంత్రి తలసానికి రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు. అనంతరం తన సోదరీమణుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

కరోనా నిబంధనలు పాటించాలి: మంత్రి మల్లారెడ్డి

రక్షా బంధన్​ను పురస్కరించుకొని సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలోని తన నివాసంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరీమణులు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. అదేవిధంగా బ్రహ్మకుమారీలకు చెందిన సోదరీమణులు, పలువురు తెరాస మహిళా కార్యకర్తలు వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అందరూ రాఖీ పండుగ జరుపుకోలేకపోయారని.. ప్రస్తుతం కేసులు తగ్గిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా శాసన సభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ నివాసంలో సందడి నెలకొంది. సికింద్రాబాద్​లోని ఆయన నివాసంలో సోదరీమణులు.. ఆయనకు రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. మొదటగా ఆయనకు తన సోదరి శకుంతల రాఖీ కట్టారు. సోదరీమణుల ఆశీస్సులు, అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందని ఉపసభాపతి అన్నారు.

రేవంత్​ విషెస్​..

ఆడపడుచులందరికీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి పలువురు మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు రాఖీ కట్టారు. మహిళా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎమ్మెల్యే సీతక్కతోపాటు పలువురు రాఖీ కట్టారు. ఆడబిడ్డలకు అండగా ఉండాలని, వారి సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలవాలని కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి... ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

భాగ్యనగరంలో పండుగ శోభ

రాఖీ పండుగను పురస్కరించుకుని భాగ్యనగరంలో సందడి నెలకొంది. తోబుట్టువులు వారి అన్నదమ్ములకు రాఖీ కట్టి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. హిమాయత్ నగర్​లోని పలు నివాసాల్లో రక్షాబంధన్​ వేడుకలు జరుపుకున్నారు. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధం ఎంతో గొప్పదని తెలుపుతూ... ఒకరికొకరు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం తోబుట్టువులకు సోదరులు కానుకలు సమర్పించారు.

మాస్కులు గిఫ్ట్​గా..

వరంగల్​లో ఆడపడుచులు తమ సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, హారతులిచ్చి, మిఠాయిలు తినిపించి.. ఎల్లవేళలా తమకు రక్షగా ఉండాలని కోరుకున్నారు. వారికి అండగా ఉంటామంటూ.. సోదరులు నిండు మనసుతో ఆశీర్వదించారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ... పలువురు మాస్కులు, శానిటైజర్లు, ఫేస్​ షీల్డులను కానుకగా ఇచ్చారు.

ఇదీ చదవండి: Rakhi: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!

Last Updated :Aug 22, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.