ETV Bharat / state

We care about eye care : మీ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా..!

author img

By

Published : Aug 3, 2023, 6:13 AM IST

We care about eye care
We care about eye care

Eye problems : మానవ శరీర అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. వాటికేదైన సమస్య వస్తే కళ్లజోళ్లు ధరిస్తుంటాం. వాటిని వాడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు 40ఏళ్లు పైబడిన వారికే ఉండే కళ్లజోళ్లు.. ప్రస్తుతం రెండో తరగతి పిల్లాడూ ధరించాల్సి వస్తోంది. దీనికి మొబైళ్ల వాడకం, టీవీల వీక్షణం, కంప్యూటర్ల వినియోగంతోనే సమస్యలు పెరుగుతున్నాయనేది ఒక వాదనైతే.. కేవలం వాటివల్లే సమస్యలు పెరగడం లేదని అంటున్నారు వైద్యనిపుణులు. ఆధునిక సాంకేతికతతో విద్యావిధానంలో మార్పులు అనివార్యం. కానీ, ఆ మార్పుల కారణంగా వచ్చే సమస్యలపై దృష్టి సారించకపోతే.. భవిష్యత్తులో కంటిసమస్యలతో బాధపడే భావిభారత పౌరుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

No Age Difference In Eye Problems : ఒకప్పటితో పొల్చితే పిల్లల్లో కంటిసమస్యలు పెరుగుతున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా కళ్లముందు కనిపిస్తున్న సత్యమిది. 6 నుంచి 18ఏళ్లలోపు పిల్లలున్న ఏ తరగతి గదిలోకి వెళ్లినా కనీసం ఒక్కరైనా కళ్లజోళ్లతో దర్శనమిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడే పిల్లల సంఖ్య 5% వరకు ఉంటోంది. జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ఆర్​బీఎస్​కే కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2022 మార్చి నుంచి డిసెంబర్ వరకు లక్షా యాభై వేల మంది విద్యార్థులను పరీక్షిస్తే, 2016 మంది పిల్లలు నేత్రసమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 2023 జనవరి నుంచి జూన్ వరకు 90 వేల మందిని పరీక్షిస్తే అందులో వెయ్యి మంది పిల్లలు.. 2022 మార్చి నుంచి 2023 జూన్ వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు 7,687 మంది. వారికి మహబూబ్‌నగర్ డైస్‌లో చికిత్స అందించగా అందులో 3 వేలమంది కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లే ఉన్నారు. ఒకప్పుడు 40 ఏళ్ల పైబడిన వాళ్లలోనే కంటి సమస్యలు చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు చిరుప్రాయంలోనే కంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి పెరిగిన డిజిటల్ తెరల వినియోగం కారణమనేది కొందరి వాదన. కానీ, పిల్లల కంటి సమస్యలకు అనేక కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లల్లో కంటి సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Eye Infection Precautions : మారుతున్న జీవనశైలి పెద్దల్లోనే కాదు.. పిల్లల్లోనూ అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. అందులో ముఖ్యమైంది పౌష్టికాహారలోపం. బలమైన ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు విఫలమవుతున్నారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తినడంపై చదువుకునే పిల్లలు ఆసక్తి చూపడం లేదు. వాటికి బదులుగా జంక్‌ఫుడ్‌కు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు కూడా విషయాన్ని గమనించకుండా ఓ విధంగా జంక్‌ఫుడ్‌ను ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు సరైన సమయానికి ఆహారం తీసుకోవడంపై పిల్లలు దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో 20 నుంచి 30% మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే వెళ్తున్నారు. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగడం లేదు. కంటినిండా నిద్ర కూడా పిల్లలకు ఉండటం లేదు. ఇలాంటి అలవాట్లన్నీ దీర్ఘకాలంలో కంటిపై ప్రభావం చూపుతాయని అందుకే చిన్న వయసులోనే పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు వైద్యులు.

Eye Problems In Children : నేటితరం పిల్లల్లో కంటిసమస్యలు పెరగడానికి మరో బలమైన కారణం డిజిటల్ తెరల వీక్షణం. పిల్లలు ఏడిస్తే పెద్దలు వారికి ఫోన్‌ ఇస్తున్నారు. ఫోన్‌ ఇస్తే తప్ప పిల్లలు ఊరుకోని పరిస్థితి. ఆడించానికీ ఫోనే.. ఆనందం వచ్చినా, అల్లరి చేసినా అన్నింటికీ ఫోనే సర్వస్వం అయిపోయింది. ల్యాప్‌టాప్‌, నోట్‌ప్యాడ్‌, ట్యాబ్‌, టీవీ, కంప్యూటర్‌ ఇలాంటివాటి నుంచి కళ్లు తిప్పుకోవడమే కష్టమై పోయింది. ఇలా పరిమితికి మించి డిజిటల్ తెరలు వీక్షించడం వల్ల కళ్లు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం డిజిటల్‌ తెరలను చూడటం వల్ల తేమ తగ్గుతుంది. కళ్లు పొడిబారతాయి. మంట మొదలువుతుంది. నీరుకారడం, మసకబారడం, కళ్లనొప్పి లాంటివి ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వెలువడిన నీలి కాంతితో రెటీనా దెబ్బతింటుంది. అసలు చదువుకునే పిల్లలు ఫోన్లే వినియోగించవద్దని, బోధనకు డిజిటల్ ప్రత్యామ్నాయం కాదని యునెస్కో తన నివేదికలో వెల్లడించింది.

పిల్లలు చదువుకునే వాతావరణం సైతం కంటిపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పిల్లలు సహజ వెలుతురులో చదవడాన్ని తగ్గిస్తున్నారు. బయట కావాల్సినంత వెలుతురున్నా.. తలుపులు, కిటికీలు మూసివేసి చీకటి గదుల్లో, ఎల్​ఈడీ బల్బుల కింద చదువుతున్నారు. వెలుతురు లేని సమయాల్లో ట్యూబ్ లైట్లు వేసుకోవాలి తప్ప ఎల్​ఈడీల వాడకం మేలైంది కాదని సూచిస్తున్నారు. వెలుతురు పుస్తకంపై పడేలా సరైన దిశలో కూర్చొని, 30 సెంటీమీటర్ల దూరంలో పుస్తకాల్ని ఉంచుకుని చదవడం, రాయడం చేయాలి. అలా కాకుండా పడుకుని, నిలబడి, తిరుగుతూ ఇలా ఇష్టానుసారం పిల్లలు చదువుతున్నారు. దీని వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి త్వరగా అలసిపోతాయి. ఎలాంటి వాతావరణంలో చదవాలన్న అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈతరం పిల్లలు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీలుదొరికితే మొబైల్‌ గేమ్స్ ఆడుతున్నారు. శారీరక వ్యాయామం ఉండటం లేదు. వీలైనంత వరకు పిల్లల్ని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలంటున్నారు వైద్యులు. సహజ వెలుతురులో సమయం గడపడం వల్ల హ్రస్వదృష్టి -మయోపియా ప్రమాదాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.

Symptoms Of Eye Diseases : పిల్లల కంటి సమస్యల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడంతోనూ పిల్లల్లో నేత్ర సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు విశ్లేషిస్తున్నారు. పిల్లలు ఎలా చూస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. దూరపు, దగ్గరి వస్తువుల్ని చూసేందుకు ఇబ్బంది పడ్డా, తరచూ కళ్ల నుంచి నీళ్లు కారడం, కంటినొప్పి, కళ్లు ఎర్రబారడం లాంటివి గుర్తిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కానీ, పిల్లల్లో ఈ సమస్యను కొందరు తల్లిదండ్రులు గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని రకాల నేత్ర సమసల్ని చిన్నప్పుడే గుర్తించకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనీసం ఏడాదికోసారైనా పిల్లల నేత్రాల్ని వైద్యులకు చూపించాలి. ఆపనీ ఎవరూ చేయడం లేదు. ఇంకొంత మంది సరైన అవగాహన లేక, మూఢ నమ్మకాలతో మెల్లకన్నులాంటి సమస్యల్ని అదృష్టంగా భావిస్తున్నారు. మెల్లకన్నును సరిచేసి దృష్టిలోపాల్ని అధికమించే అవకాశం ఉన్నా తల్లిదండ్రులు అందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో పిల్లలు కంటిచూపుని కోల్పోతున్నారు. ఇక కంటిసమస్యల్ని గుర్తించి వైద్యులు కళ్లద్దాలు వాడాలని సూచించినా, చిన్న వయసులో కళ్లద్దాలేంటని ఎగతాళి చేస్తారన్న భావనతో పిల్లలు అద్దాలు వాడటం లేదు.

We Care About Eye Care : కంటి శుభ్రతపైనా పిల్లలకు కనీస అవగాహన కల్పించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా కళ్లను తాకేముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు. కంటిచూపు సరిగా లేని పిల్లలు చదువులోనూ వెనుకబడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దృష్టి ప్రభావం పిల్లల శారీరక ఎదుగుదలపైనా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు కంటిచూపు తక్కువున్న వారిలో చేయి-కన్నుకు మధ్య సమన్వయం లోపిస్తుంది. దాంతో క్రీడలు, వ్యాయామం తదితర ఫిజికల్‌ యాక్టివిటీస్‌పై వారు మొగ్గు చూపలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు ఏమైనా అంటించుకోవడానికి వాడే సూపర్‌గ్లూ గమ్‌లో వాడే సున్నంలోని రసాయనాల కారణంగా కంటి సమస్యలు వస్తున్నట్లు తేలింది. రసాయనాలతో పెద్దలు, పిల్లల్లో తలెత్తుతున్న కంటి సమస్యలపై నారాయణ నేత్రాలయతో కలిసి ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ-ఎల్వీపీఈఐ అధ్యయనం చేసింది. సూపర్‌గ్లూను తాకిన చేతులతోనే ముక్కును, కళ్లను రుద్దుకుంటున్నారు. ఫలితంగా వాటిలోని క్షారాలు కంటి రెటీనాను దెబ్బతీస్తాయని,కార్నియాలో కీలకమైన లింబస్‌ అనే భాగం దెబ్బతింటుందని వైద్యులంటున్నారు. దాంతోపాటు ఫ్లోర్‌ క్లీనర్లు, యాసిడ్లను పిల్లలకు దూరంగా పెట్టాలని, వాటిని వాడాల్సి వస్తే పెద్దలూ కళ్లద్దాలు, మాస్క్‌లు ధరించి ఉపయోగించాలని కోరుతున్నారు. పాఠశాల వయసులోనే కళ్లద్దాల బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా తల్లిదండ్రులు సరైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.