BJP Leaders on TRS:'కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులమయం'

author img

By

Published : May 15, 2022, 4:51 AM IST

Updated : May 15, 2022, 5:56 AM IST

BJP MEET

BJP MEET: రాష్ట్రంలో తెరాస పాలనాతీరుపై రాష్ట్ర భాజపా నేతలు నిప్పులు చెరిగారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన నాయకులు... రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు వెనుకడుగు వేయొద్దని శ్రేణులకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులమయంగా మారిందని భాజపా వస్తేనే ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.

BJP MEET: రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగ భరితమైన ప్రసంగం చేశారు. తెరాస, కాంగ్రెస్‌కు అవకాశమిచ్చినా... రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి సాధించలేదని, తమ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ప్రజలను కోరారు. కేసీఆర్ కుటుంబ పాలన ఇలాగే కొనసాగితే... తెలంగాణ మరో శ్రీలంక కాక తప్పదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసినా... అది చివరకు తెరాసకే ప్రయోజనం చేకూర్చుతుందని బండి సంజయ్‌ విమర్శించారు.

వేలాది మంది ప్రాణత్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని... తెలంగాణకు రావాలంటే కేసీఆర్ కుటుంబం అనుమతి తీసుకోవాలా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించిన ఆయన... తెరాస వైఫల్యాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. ఎస్సలను అడుగడుగునా సీఎం మోసం చేశారని.. ఎస్టీల రిజర్వేషన్లు పెరగకపోవడానికి కారణం ఆయనేని విమర్శించారు.

'కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులమయం'

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం నాటికి 75 వేల కోట్లు మాత్రమే ఉన్న అప్పు ప్రస్తుతం 5 లక్షల కోట్లకు చేరిందని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం లేదని తెలిసే తన వైఫల్యాలను కేసీఆర్ ఇతర పార్టీలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చైతన్యం నింపుకొన్న తెలంగాణ ప్రజలు తెరాస బుద్ధిచెప్పటం ఖాయమని ఈటల హెచ్చరించారు.


ఇవీ చూడండి: Ktr Tweet on Amith shah visit: 'కేటీఆర్ కొత్త నిర్వచనం.. భాజపా అంటే బక్వాస్ జుమ్లా పార్టీ'

Last Updated :May 15, 2022, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.