Anandasai visit Vemulawada Temple : యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలో భాగంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాన్ని స్తపతి ఆనంద్సాయి సందర్శించారు. రాజన్న ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో చాలాసార్లు చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి వచ్చే ముందు ఒకసారి స్వయంగా పరిశీలించాలని వచ్చినట్లు చెప్పారు.
ఆలయ లేఅవుట్ను కార్యనిర్వాహణాధికారి రమాదేవితో కలిసి ఆనంద్ సాయి పరిశీలించారు. ప్రధాన ఆలయాన్ని ముట్టుకోకుండా భక్తులకు తగు సదుపాయాలు కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్లాన్ రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. మరో పక్షం రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి చర్చించిన తర్వాత పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తామని వివరించారు.
'ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పారు. ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆర్కిటెక్చర్ వ్యాల్యూస్తో డిజైన్ చేయాలని అనుకుంటున్నాం. సీఎంతో కలిసి మరోసారి ఆలయం పరిశీలిస్తాను. హెలికాఫ్టర్లో ఆలయం ఏరియల్ వ్యూ చూస్తాం. ఆలయం మాస్టర్ ప్లాన్ను సీఎంకు వివరిస్తా. ఆయన సూచనలతో ఆలయ ప్రణాళిక సిద్ధం చేస్తా.' - ఆనంద్ సాయి, స్తపతి
ఇదీ చదవండి : ఏడు గోపురాల వైభవం.. యాదాద్రీశుడి ఆలయం