ETV Bharat / state

దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ​క్షేత్రంగా.. రామగుండం ఎన్టీపీసీ

author img

By

Published : Apr 12, 2023, 2:26 PM IST

Ramagundam NTPC : ఆధునికతరం అభివృద్ధి సూచికల్లో కీలకంగా మారింది విద్యుత్ వినియోగం. స్వరాష్ట్రంగా ఏర్పడే సమయానికి ఈ విషయంలో తెలంగాణపై ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ... తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి... వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ఎన్టీపీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోంది.

ramagundam ntpc emerging as massive power production centre in india
అతిపెద్ద విద్యుత్​క్షేత్రంగా రామగుండం ఎన్టీపీసీ

అతిపెద్ద విద్యుత్​క్షేత్రంగా రామగుండు ఎన్టీపీసీ

Ramagundam NTPC : విద్యుత్తు ఉత్పత్తిలో పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాజెక్టులు రికార్డు సృష్టిస్తున్నాయి. ఎన్టీపీసీలో 2వేల600 మెగావాట్లతో పాటు సోలార్‌, ఫ్లోటింగ్‌ సోలార్‌, ప్లాంట్ల ద్వారా 4,310 మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్‌-1 కింద 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో చేపడుతున్న ప్రాజెక్టులో మొదటగా చిమ్నీ నిర్మాణం పూర్తి చేశారు.

Ramagundam NTPC news : గత మార్చి 24న ఇందులో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించారు. అలాగే మరో 800 మెగావాట్ల రెండో యూనిట్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్​జీడీ నిర్మాణం, యాష్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌ పూర్తితో స్టీమ్‌ బ్లోయింగ్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వచ్చే జూన్‌ నాటికి ఈ యూనిట్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

Ramagundam NTPC updates : రాష్ట్రంలో ఇప్పటికే 15వేల 498 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంది. ఎండల తీవ్రతతో మున్ముందు ఇదింకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐతే, ఫేజ్‌-2 కింద 2వేల 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణ పనులను అగ్రిమెంట్‌ జరిగిన వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని ప్రకటించారు. అగ్రిమెంట్ పూర్తైతే రామగుండం థర్మల్ పవర్ కార్పోరేషన్ ఉత్పత్తి 6795 మెగావాట్లకు చేరనుంది.

Ramagundam NTPC latest record : ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్‌ ఎన్టీపీసీలో 4760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ముందంజలో ఉంది. రామగుండం ఎన్టీపీసీ అధికారులు థర్మల్ విద్యుత్‌కు మాత్రమే పరిమితం కాకుండా సోలార్‌, నీటిపై తేలియాడే సౌరపలకలతోనూ విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ కేంద్రం 100మెగావాట్లది రామగుండంలో నిర్మించారు. దానికి అదనంగా 85మెగావాట్లు త్వరలోనే జోడించబోతున్నారు. గతంలో నిర్మించిన థర్మల్ పవర్‌ ప్లాంట్ల వలె కాక కొత్తగా నిర్మించే ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

ఇప్పటికే 1600మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం కాగా.. ఇది మరింతగా విస్తరిస్తే దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఎన్టీపీసీ రామగుండం నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పరిశ్రమలు ఇతరత్రా వినియోగాల కారణంగా తమిళనాడు లో అత్యధికంగా 16వేల మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తే.. ఆంధ్ర, తెలంగాణా ఉమ్మడిరాష్ట్రాలు కలిపి 16వేల మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించేవి. ఇప్పుడు తెలంగాణ మాత్రమే 15వేలకు పైగా మెగావాట్ల విద్యుత్‌ని వినియోగిస్తోంది. ఎత్తిపోతల పథకాలు, పారిశ్రామిక వృద్ధి, ఐటీ పరిశ్రమ వృద్ధి చెందుతోన్న కారణంగా విద్యుత్‌ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సునీల్ కుమార్‌ చెబుతున్నారు. అందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ఎన్టీపీసీకి రామగుండంలో 9వేల 500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2వేల600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఎన్టీపీసీ ఇప్పటికే ప్రారంభించింది. మిగిలిన 2వేల400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. చివరకు నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకురాగా... ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తి ప్రదర్శిస్తూ వచ్చింది. మొత్తం 4వేల మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎమ్​డీ అరుప్‌రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముందుంచారు.

ఐతే అధికారులు రామగుండం మండలం పరిధిలో బీపీఎల్ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకివ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఇక్కడే భూమి కేటాయిస్తే నాలుగేళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఎన్​టీపీసీ అధికారులు సీఎంకు తెలిపారు. ఐతే, నీటితో పాటు కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

అలాగే ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్ పాండ్ కోసం 400 ఎకరాలు కావాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే గతంతో పోలిస్తే బూడిద వినియోగం గణనీయంగా పెరగడంతో రహదారుల నిర్మాణానికి, ఫ్లైయాష్ ఇటుకల తయారీకి కూడా ముమ్మరంగా వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అలానే పర్యావరణ సంరక్షణకూ తమవంతు చర్యలు తీసుకుంటున్నా మని అంటున్నారు.

"ఉజ్వల్ భారత్-ఉజ్వల్ భవిష్య-పవర్ 2047” ముగింపు కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి న్యూదిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అందులో ఒకటైన 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ పరంగానూ ఎంతో ప్రత్యేకమైనదని అధికారులు అంటున్నారు. 423 కోట్ల రూపాయాలతో.. ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. 40 బ్లాకులుగా విభజించి, ఒక్కొక్క బ్లాక్‌ 2న్నర మెగా వాట్ల విద్యుదుత్పత్తి అయ్యేవిధంగా విభజించారు. ప్రతి బ్లాక్‌లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్‌తోపాటు 11వేల200 సోలార్ మాడ్యూల్‌ల శ్రేణి ఉంటుంది.

ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్ తో పాటు హెచ్​టీ బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ మాడ్యూల్స్ అన్ని హై-డెన్సిటీ పాలిథిలిన్ మెటీరియల్స్‌తో తయారు చేసి ఫ్లోటర్లపై బిగించారు. మొత్తం తేలియాడే వ్యవస్థను... బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బెడ్‌లో ఉంచిన డెడ్ వెయిట్‌లను ప్రత్యేకంగా హై మాడ్యులస్ పాలిథిలిన్ తాళ్లతో కదలకుండా బిగించారు.

ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్‌ తరలిస్తున్నారు. ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్​టీ ప్యానెల్, పర్యవేక్షక నియంత్రణతో పాటు డేటా సేకరణ సహా అన్ని విద్యుత్‌ పరికరాలు కూడా.. తేలియాడే ఫెర్రో సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. ఈ తేలియాడే సౌర ఫలకాలు నీరు ఆవిరికాకుండా ఆపడమే కాకుండా ఏటా సుమారు 32.5లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని పొదుపు చేస్తాయి. అలాగే లక్షా65వేల టన్నుల బొగ్గును సంవత్సరానికి 2లక్షల పదివేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను కూడా ఇవి నివారించగలుగుతున్నాయని ఎన్​టీపీసీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రానికి అవసరమైన విద్యుదుత్పత్తి అందించి వెన్నుదన్నుగా ఉంటామని ఎన్​టీపీసీ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యుత్‌ అవసరాలు తీరుస్తున్న రాబోయే రోజుల్లో ప్రస్తుత ఉత్పత్తి సరిపోదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా పెంచుతామని అధికారులు చెబుతున్నారు. అలాగే పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని త్వరలోనే రామగుండం ఎన్​టీపీసీ యునిట్‌ దేశంలో అతిపెద్ద యునిట్‌గా మారబోతోందని అంటున్నారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.