అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ విధులు ప్రశంసనీయంగా ఉన్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అభినందించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని సదుపాయాలతో 15 స్ట్రెచర్ బెడ్స్ అందజేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు పడకలను అందజేశారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలుగా సహాయం అందించాయని కలెక్టర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్, సెలైన్ ఇతర సదుపాయాలతో కూడిన స్ట్రెచర్ బెడ్స్ అందించారని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
కొవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి 100 మందిలో 30 మందికి పాజిటివ్ వచ్చిందని.. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రజల సహకారం, అవగాహనతో ప్రస్తుతం పది శాతానికి తగ్గిందని వెల్లడించారు. మరి కొద్దిరోజుల్లోనే 5 శాతానికి చేరే అవకాశం ఉందని.. పూర్తిగా తగ్గించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు దర్శన్ సింగ్, ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే రెండేళ్లలో మరణిస్తామనేది.. నిజమా? అబద్ధమా?