నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహం తారుమారు అయింది. నగరంలోని శివాజీనగర్కు చెందిన గాలామణి(65) అనే వృద్ధురాలు వారం రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున మృతి చెందింది. సిబ్బంది మృతదేహాన్ని మూటకట్టి మార్చురీకి తరలించారు. అనంతరం అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఖననం చేసే సమయంలో మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాము తీసుకొచ్చిన మృతదేహం తమ తల్లి గాలామణిని కాదని.. వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన గంగమణిది అని తెలిసి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. గాలామణి మృతదేహం కోసం సిబ్బంది ఆరా తీయగా.. గంగమణి కుటుంబసభ్యులు అప్పటికే దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు తెలిసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తమ తల్లి అంత్యక్రియలు నిర్వహించుకోలేకపోయామని కుటుంబసభ్యులు వాపోయారు. తిరిగి గంగమణి మృతదేహం ఆసుపత్రిలో అప్పగించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది గంగమణి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. జలాల్పూర్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ మేరకు రెండు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్ తెలిపారు.
రెండు నెలల్లో రెండో ఘటన
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారు కావడం రెండు నెలల్లో ఇది రెండో ఘటన. గతంలోనూ గాయత్రి నగర్కు చెందిన నర్సుబాయి అనే మహిళ కరోనాతో మృతి చెందగా.. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆమె మృతదేహానికి బదులుగా నగరంలోని బర్కత్పూర్కు చెందిన ముస్లిం మహిళ మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబసభ్యులు ఆ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. విషయాన్ని గుర్తించిన మైనార్టీ కుటుంబసభ్యులు ఆసుపత్రి నిర్వాహకులపై మండిపడ్డారు. తాజాగా మంగళవారం మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం కావడంతో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్కు ప్రభుత్వం అనుమతి