ETV Bharat / state

ఉపాధి కోసం గల్ఫ్‌లో ఆపసోపాలు

author img

By

Published : Aug 28, 2020, 1:07 PM IST

ఉపాధి కోసం గల్ఫ్‌లో ఆపసోపాలు
ఉపాధి కోసం గల్ఫ్‌లో ఆపసోపాలు

జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. ఉపాధి లేక కొందరి పరిస్థితులు దినదిన గండంలా కొనసాగుతాయి. ఈ పరిస్థితుల్లో దూరపు కొండలు నునుపులా గల్ఫ్‌ దేశాలు కనిపిస్తాయి. అక్కడికెళ్తే కష్టాలు గట్టెక్కుతాయన్న ఆశ అప్పు చేసి విమానం ఎక్కేలా చేస్తాయి. ఆ బాట చాలా మందికి ముళ్లబాటలా మారి కష్టాలను మూటగట్టుకొచ్చేలా చేస్తున్నాయి. డబ్బు సంపాదనకు వెళ్లిన వారిలో చాలా మంది డబ్బాల్లో శవాలుగా తిరిగొస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వారి పరిస్థితి మారింత దారుణంగా మారింది.

ఉపాధి కోసం సింగపూర్‌ వెళ్లిన ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం ఎలగడపకు చెందిన యువకుడు భుక్యా తిరుపతినాయక్‌ ఈ నెల 23న అక్కడే కరోన బారినపడి మరణించారు. కొవిడ్‌ లక్షణాలతో మరణించడం వల్ల సింగపూర్‌ ప్రభుత్వం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి పంపించకుండా బుధవారం రాత్రి అక్కడే ఖననం చేయించింది. కడసారి చూపునకు నోచుకోలేకపోయామని భార్య, తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. సింగపూర్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన విషయం చరవాణుల్లో చూసుకున్న కుటుంబసభ్యులు గురువారం ఇంటివద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించారు.

అంత్యక్రియలక్కడ.. నివాళులిక్కడ

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లి వాసి ఈశ్వర్‌ దేవేందర్‌ మూడు రోజుల కిందట దుబాయ్‌లో మరణించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. అప్పటి నుంచి ఆ కుటుంబం నిద్రాహారాలు మాని రోదిస్తోంది. మూడేళ్ల కిందట రూ.1.50 లక్షలు అప్పు చేసి గల్ఫ్‌ బాట పట్టగా రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చారు. ఇక్కడ ఉపాధి లేక 9 నెలల కిందట మళ్లీ ఎడారి దేశానికే వెళ్లాడు. అక్కడ ఏమైందో.. ఎలా జరిగిందో తెలియదు కానీ దేవేందర్‌ మరణించినట్లు కబురందింది.

ఉమ్మడి జిల్లాకు చెందిన 25 వేల మందికి పైగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. దుబాయ్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, రియాద్‌, ఖతార్‌, కువైట్‌ వంటి దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వాతావరణం పడక అనారోగ్యంతో, భవన నిర్మాణాల్లో ప్రమాదాలతో, రోడ్డు ప్రమాదాల్లో విగత జీవులవుతున్నారు. అనుకున్న వేతనం రాక, అప్పులు తీరక ఒత్తిడితో గుండెపోటుకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో పరిశీలిస్తే ప్రతి నెలా ఒకరిద్దరి శవాలు స్వగ్రామాలకు వస్తున్నాయి.

పట్టించుకోని ప్రవాసీల డిమాండ్లు..

రాష్ట్రం నుంచి లక్షల సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు. వీరి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అక్కడి వివిధ సంఘాలు, కార్మికులు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఉద్యమం చేశారు. ఊరూరా జైఎన్నారై పాలసీ పేరుతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు.. దీంతో పలువురు ప్రతినిధులతో ఒక ముసాయిదా తయారు చేశారు. అమల్లోకి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ప్రవాసీలను నిరాశకు గురిచేసింది. కదలిక లేక ఆ ముసాయిదా మూలన పడింది.

ప్రవాసీ విధానంపై ప్రభుత్వం స్పందించాలి

ప్రవాసుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌లో మరణిస్తే ప్రయోజనం కలిగేలా బీమా ప్రవేశపెట్టాలి. అక్కడి రాయబార కార్యాలయాల్లో తెలుగు అధికారులు ఉండేలా చూడాలి. జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసాయం చేయాలి. ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

- నవీన్‌, గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక ప్రతినిధి

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.