'కేసీఆర్ సాబ్.. మీ ప్లీనరీలో వీటికి సమాధానం చెప్పండి'

author img

By

Published : Apr 27, 2022, 11:02 AM IST

Bandi Sanjay Letter to KCR

Bandi Sanjay Letter to KCR : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెరాస ప్లీనరీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో తను లేఖలో అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల తెరాస పాలనపై వెయ్యి ప్రశ్నలడిగినా సరిపోదన్న బండి.. లేఖలో అడిగిన కొన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలన్నారు.

Bandi Sanjay Letter to KCR : తెరాస ప్లీనరీలో సమాధానం చెప్పాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల పాలనపై వెయ్యి ప్రశ్నలడిగినా సరిపోదన్న సంజయ్.. లేఖలో అడిగిన ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వాలని కోరారు. 2014, 2018 ఎన్నికల హామీ పత్రాల్లోని ఎన్ని హామీలు నెరవేర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, పోడు భూములకు పట్టాలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు, దళితులకు మూడెకరాల భూమి అంశాలపై కేసీఆర్‌ స్పందించాలని లేఖలో పేర్కొన్నారు.

వారి చావులకు సమాధానమివ్వండి : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించిన మాట వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీ బంధు, బీసీ-ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు- ఖర్చు, రూ.3వేల కోట్ల బీసీల బోధన రుసుములు ఎప్పుడు చెల్లిస్తారని అడిగారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు హామీ ఏమైందని ఎదరుదాడికి దిగారు. 8 ఏళ్లలో 30 వేలమంది రైతుల ఆత్మహత్యలకు సమాధానామివ్వాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ అమలు ఎప్పుడు పూర్తవుతుందని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగాయని ఆరోపించిన సంజయ్ దానిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

చర్చకు రెడీయా : కాళేశ్వరం రీడిజైనింగ్‌ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, పాలమూరు-రంగారెడ్డి సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ ప్రాజెక్టుల, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బండి ఆరోపించారు. ఈ అంశాలను అఖిలపక్షం ముందు చర్చిస్తారా అని ప్రశ్నించారు.

అది నిజం కాదా : రెండు పడక గదుల ఇళ్లు, కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజాం షుగర్‌ పునరుద్ధరణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం హామీలు ఏమయ్యాయని అడిగారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా? అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.