ETV Bharat / state

Sand Mafia: ఇసుక మాఫియా దౌర్జన్యం.. అడ్డుకున్న అధికారులను నెట్టేసి మరీ..!

author img

By

Published : Apr 23, 2023, 10:41 AM IST

sand mafia
sand mafia

Sand Mafia In Kodada: రాష్ట్రంలో ఇసుక మాఫియా దందా జోరుగా సాగుతోంది. కోదాడ వద్ద 15 లారీలను అడ్డుకున్న టీఎస్​ఎండీసీ అధికారులను నెట్టేసిన ఇసుక మాఫియా.. హైదరాబాద్‌ దిశగా వాహనాలను తరలించింది. డయల్‌ 100కు ఫోన్‌ చేసినా పోలీసుల స్పందన లేదని టీఎస్​ఎండీసీ అధికారులు తెలిపారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో.. ఆరు లారీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఇసుక దందాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

15 ఇసుక లారీలను పట్టుకున్న టీఎస్​ఎండీసీ.

Sand Mafia In Kodada: కొంతకాలంగా ఏపీలోని కృష్ణా పరీవాహక ప్రాంతం నుంచి.. నిత్యం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సుమారు 80 నుంచి 100 లారీలు ఇసుక తీసుకొని అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కోదాడ నుంచి హైదరాబాద్‌ వరకు జాతీయ రహదారిపై ఉన్న పోలీస్‌ స్టేషన్లతో పాటు రెవెన్యూ, మైనింగ్‌, రవాణా అధికారులను మేనేజ్‌ చేయడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో లారీలో 65 టన్నుల వరకు లోడ్‌ చేసుకొని హైదరాబాద్‌ తెచ్చి.. లారీకి రూ.75 వేల వరకు అమ్ముతున్నారు. ఇలా సగటున రోజుకు రూ.60 లక్షలకు పైగా ఇసుక వ్యాపారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి ఈ వ్యవహారంలో హైడ్రామా నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, విజయవాడ నుంచి అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. హైదరాబాద్‌లో విక్రయానికి వెళుతున్న లారీలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్​ఎండీసీ) అధికారులు.. కోదాడ సరిహద్దుల్లో పట్టుకున్నారు. లారీలను అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉందని.. ఏపీ ఇసుక మాఫియా వారిని దబాయించింది.

ప్రజా ప్రతినిధి పీఏనే సూత్రధారి: సుమారు 15 లారీల డ్రైవర్లు, లారీలకు ఎస్కార్ట్‌గా వస్తున్న వారు.. ఐదుగురు అధికారులతో తొలుత వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిని పక్కకు తోసివేసి లారీలను హైదరాబాద్‌ దిశగా నడిపించారు. అధికారులు డయల్‌ 100కు ఫోన్‌ చేయగా, కోదాడ పోలీసులు సకాలంలో స్పందించలేదని టీఎస్​ఎండీసీ అధికారులు తెలిపారు. వారు ఉన్నతాధికారులకు విషయం చెప్పగా.. నల్గొండ పోలీసులు కేతేపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో మూడు లారీలను, రాచకొండ పోలీసులు చౌటుప్పల్‌ పరిధిలో 3 లారీలను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన.. ఓ ప్రజాప్రతినిధి పీఏ అధికారులకు ఫోన్‌ చేసి ఆ లారీలు పట్టుకోవడానికి మీకేం అధికారం ఉందని బెదిరించినట్లు సమాచారం.

ఇసుక మాఫియాతో కుమ్మక్కైన పోలీసులు: లారీలను పట్టుకునే బాధ్యత పోలీసు, రెవెన్యూ వాళ్లదని, వారు చూసుకుంటారని, తక్షణం ఆ లారీలను హైదరాబాద్‌ పంపించాలని హుకూం జారీ చేసినట్లు తెలిసింది. పక్షం రోజుల కింద కేతేపల్లి టోల్‌ప్లాజా వద్ద నాలుగు ఇసుక లారీలను పోలీసులు పట్టుకోగా.. ఆ పీఏ ఫోన్‌ చేయడంతో లారీలపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా.. టీఎస్‌ఎండీసీ అధికారులు 15 లారీలను అడ్డుకోగా.. పోలీసులు 6 లారీలపైనే కేసులు నమోదు చేశారు. మిగిలిన వాటిని వదిలేశారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు.. ఇసుక మాఫియాతో కుమ్మక్కు అయ్యారని, అందుకే అక్రమంగా వస్తున్న ఇసుక లారీలను పట్టుకొని పోలీసులకు అప్పగించాలని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు టీఎస్​ఎండీసీ వర్గాలు తెలిపాయి.

15 లారీలను తమ వెబ్​సైట్​లో బ్లాక్​ చేసిన టీఎస్​ఎండీసీ: ఇతర రాష్ట్రాల నుంచి ఇసుక, ఇతర నిషేధిత వస్తువులు.. తెలంగాణలోకి రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులే అడ్డుకోవాలి. కోదాడ వద్ద.. పోలీసు, రవాణా శాఖ చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటి వద్దే ఈ లారీలను.. తనిఖీ చేసి నిలువరించాలి. వాస్తవానికి టీఎస్​ఎండీసీ అధికారులు ఆ చెక్‌పోస్టులు దాటిన తర్వాతే.. ఈ ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఈ లారీలన్నీ తెలంగాణ రిజిస్ట్రేషన్‌వేనని.. టీఎస్​ఎండీసీ అధికారులు తెలిపారు. సుమారు 15 లారీలు వాటి రిజిస్ట్రేషన్‌ నంబరు ఆధారంగా.. భవిష్యత్తులో టీఎస్‌ఎండీసీ నుంచి ఇసుకను రవాణా చేయకుండా వెబ్‌సైట్‌లో బ్లాక్‌ చేశామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.