మునుగోడులో హీటెక్కిన పాలిటిక్స్, గెలుపు కోసం మూడు పార్టీల ప్లాన్స్

author img

By

Published : Aug 17, 2022, 9:21 AM IST

Updated : Aug 18, 2022, 12:09 PM IST

Munugodu By Election

Munugodu By Election మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉపపోరును సెమీఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్రనాయకుల పర్యటనకు ఏర్పాట్లు, పార్టీల్లో చేరికలు, ఇతర పార్టీల మద్దతు కోసం వరుస భేటీలు జరుపుతున్న నేతలు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు

Munugodu By Election : మునుగోడు అభివృద్ధి తమతోనే సాధ్యమంటూ అధికార పార్టీ.. ఉపఎన్నికల ఊపు, నేతల చేరికలతో ఉత్సాహంతో కమలదళం.. సిట్టింగ్‌ సీటులో గెలుపు కోసం చావోరోవో తేల్చుకునేలా హస్తం పార్టీ.. ఇలా.... మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా సత్తాచాటేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు, అగ్రనేతల పర్యటనల కోసం ప్రణాళికలతో మునుగోడు ఉపఎన్నిక మినీ ఎన్నికల పోరును తలపిస్తోంది.

Munugodu By Election news : మునుగోడు ఉపఎన్నికపై కమలనాథులు ప్రత్యేకదృష్టి కేంద్రీకరించారు. భాజపా రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్‌ ఇవాళ సమావేశం కానున్నారు. జనగామలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భోజన విరామ సమయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన భాజపా నేతలతో సమావేశమై.... ఈ నెల 21న అమిత్ షా బహిరంగ సభ, ఉపఎన్నికల్లో గెలుపుపై బండి వ్యూహ రచన చేయనున్నారు. చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డితోపాటు వనపర్తి జిల్లాకు చెందిన పలువురు తెరాస నేతలు ఈటల రాజేందర్‌ సమక్షంలో కమలం గూటికి చేరారు. సొంత పార్టీ వారికి వెల కడుతున్న అధ్వానమైన పార్టీ తెరాస అని ఈటల విమర్శించారు.

ఎంపీపీ వెంకట్‌రెడ్డి భాజపాలో చేరటం పట్ల ఉపఎన్నికల చౌటుప్పల్‌ ఇంఛార్జ్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్‌ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస విజయాన్ని ఆపలేరని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు.... ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడు నుంచి నారాయణపురం వెళ్లే మార్గంలో సభాస్థలాన్ని ఎంపిక చేయగా... గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ..... భారీ జనసమీకరణ దిశగా అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది.

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణిక్కం ఠాగూర్ ... ఇవాళ‌, రేపు గాంధీభవన్‌లో సమీక్షలు జరపనున్నారు. క్షేత్రస్థాయిలోనూ విస్తృతంగా పర్యటిస్తున్న హస్తం నేతలు క్యాడర్‌ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా మండలాల వారీగా వరుస భేటీలు జరుపుతున్నారు. మర్రిగూడ, నాంపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నేతలు తెజసను కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం తెలిపారు.

ఈ నెల 19న మునుగోడు నియోజకవర్గంలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ పర్యటిస్తారని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ జ్యోతి తెలిపారు. పాల్‌ పర్యటన, ఉపఎన్నికలో పోటీకి సంబంధించిన కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆమె చౌటుప్పల్‌లో విడుదల చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్లు యుగతులసి ఫౌండేషన్‌ ప్రకటించింది. గోవుపట్ల నిబద్ధత చూపాల్సిన అవసరముందని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివకుమార్‌ కోరారు.

Last Updated :Aug 18, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.