ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే... తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసినందుకు సోమవారం మిర్యాలగూడ మండలంలోని బాలాజీ రైస్ మిల్లును టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు.
నాణ్యమైన ధాన్యానికి పూర్తిగా మద్దతు ధర చెల్లించి.. కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్ అన్నారు. ఐదు జిల్లాల నుంచి భారీగా ధాన్యం వస్తోందని.. నాణ్యత లేని కారణంగా.. అందుకు తగ్గ ధరను చెల్లించడం కష్టమని తెలిపారు. ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా నాణ్యతను బట్టి మద్దతు ధర చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మూడువేల ట్రాక్టర్లు.. మిల్లుల ముందు బారులు తీరాయని కలెక్టర్కు వివరించారు.