Corona: పాఠశాలల్లో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు

author img

By

Published : Sep 15, 2021, 4:50 PM IST

corona

అసలే మూడో వేవ్ అన్న సంశయం. ఇంతకు బడులు తెరుస్తారా అనే సందేహం. ఆ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ... మూడో ఉద్ధృతి లేదన్న సంకేతాలనిస్తూ పాఠశాలల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది ప్రభుత్వం. కానీ వారం గడిచేసరికి బడుల్లో అగమ్యగోచరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుస కరోనా కేసులతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో... ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.

అక్టోబరులో థర్డ్ వేవ్ ఉంది... ఇప్పుడు బడులు తెరవడమేంటి ఫీజుల కోసం కాకపోతే. రుసుములు వసూలు చేశాక యథావిధిగా పాఠశాలలు మూతపడతాయి... అందులో సందేహమే లేదు... ఇవీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న సంశయాలు. కరోనా మూడో ఉద్ధృతికి అవకాశమే లేదని వైద్యారోగ్యశాఖ తేల్చడంతో... పిల్లలంతా తరగతి గదుల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాలయాలన్నీ ఈ నెల నుంచి పునఃప్రారంభమయ్యాయి. కానీ కొంతమందిలో నెలకొన్న అనుమానాలు నిజం చేస్తూ... వివిధ పాఠశాలల్లో వరుసగా కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదికి పైగా బడులు... కరోనా కేసులతో మూతపడే స్థితికి చేరుకున్నాయి.

క్రమంగా పెరుగుతున్న కేసులు

దేవరకొండ రోడ్డులోని ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్... కొవిడ్ బారిన పడి కోలుకున్నాక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బడి ప్రారంభానికి ముందే పాజిటివ్ బారిన పడ్డ ఆయన... తర్వాత మృతి చెందడంతో మిగతా వారిలో ఆందోళన మొదలైంది. సదరు ప్రిన్సిపల్ తో పాటు పాఠశాల ప్రారంభం కోసం పలువురు పని చేశారు. పరీక్షలు చేస్తే ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణయింది. దేవరకొండ మండలం కమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 8న వైద్యారోగ్యశాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదో తరగతి విద్యార్థిలో కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. మిర్యాలగూడలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినికి సోకటంతో ఈనెల 4న 50 మందికి పరీక్షలు చేశారు. శుభకార్యానికి వెళ్లివచ్చామని బాలిక చెప్పటంతో... ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా తండ్రిలో లక్షణాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబంలోని నలుగురు హోం ఐసోలేషన్​కు వెళ్లారు.

మూడు జిల్లాల్లోనూ ప్రభావం

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు మాస్టార్లు కొవిడ్ బారిన పడ్డారు. బొమ్మలరామారం ఆదర్శ పాఠశాలలో మాస్టారుకు కరోనా సోకగా... 60 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్ వచ్చింది. చౌటుప్పల్ మండలం జైకేసారం విద్యాలయంలో ప్రధానోపాధ్యాయురాలికి పాజిటివ్ రావడంతో... గత శుక్రవారం నుంచి బడికి సెలవులు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోనూ పలు విద్యాలయాల్లో కేసులు బయటపడ్డాయి. తుంగతుర్తి మండలం బండరామారం బడిలో ఉపాధ్యాయురాలు, ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. మిగిలిన పిల్లలందరికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. కోదాడ మండలం బిక్యాతండాలో ఉపాధ్యాయురాలికి కొవిడ్ నిర్ధరణయింది. ఆత్మకూరు(ఎస్) ఆదర్శ పాఠశాలలో టీచర్​... తిరుమలగిరి మండలం అనంతారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని... మోతె మండలం సిరికొండ ఉన్నత పాఠశాలలో మరో పంతులుకి కరోనా సోకినట్లు తేలింది. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు... కొవిడ్ తేలడంతో విద్యాలయాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఫీజులకోసమేనన్న భావనలో తల్లిదండ్రులు

తొలి రెండు వారాల్లోనే వాతావరణం ఇలా ఉంటే... మున్ముందు ఎలా ఉంటుందోననే సందేహం తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అయితే ప్రైవేటు బడుల్లోనూ పిల్లల హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంటోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫీజుల కోసమే ఇప్పుడు పాఠశాలలు తెరుస్తున్నారని భావిస్తున్న తల్లిదండ్రులు... పిల్లల్ని బయటకు పంపకపోవడమే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నారు. దేవరకొండ రోడ్డులోని పెద్ద బడిలో 5 వేల మంది పిల్లలు చదువుతున్నారు. అలాంటి బడిలో ప్రిన్సిపల్ మృత్యువాత పడటంతో... విద్యార్థుల్ని పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. చదువుకు దూరమవుతారన్న భయం ఒకవైపు... పిల్లలకు ఏమన్నా అవుతుందేమోనన్న ఆందోళన మరోవైపు... ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విద్యార్థుల్ని బడికి పంపాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.

ఇదీ చదవండి: Ganesh Immersion: హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.