నాగర్​కర్నూల్ జిల్లా డయాలసిస్ కేంద్రంలో రోగులకు తప్పని నిరీక్షణ

author img

By

Published : Aug 25, 2022, 2:58 PM IST

డయాలసిస్ కేంద్రం

ISSUES AT DIALYSIS CENTRE రాష్ట్రంలో డయాలసిస్ రోగుల సౌలభ్యం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో రోగులు రక్తం శుద్ధి చేసుకోలంటే నిరిక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులకు సరిపడినన్ని పడకలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ISSUES AT DIALYSIS CENTRE: నాగర్​కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో కిడ్నీలు పాడై ఇబ్బందులు పడుతున్న రోగుల సౌలభ్యం కోసమే ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ డయాలసిస్ సెంటర్​లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో రోజురోజుకు డయాలసిస్ రోగులు పెరిగిపోతుండడంతో ఐదు పడకల డయాలసిస్ కేంద్రం ఏ మాత్రం సరిపోవడం లేదు.

డయాలసిస్ కేంద్రంలో రోగులకు రక్తం శుద్ధి చేయడానికి మొత్తం 5 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నాలుగు పడకల్లో సాధారణ రోగులకు రక్తం శుద్ధి చేస్తున్నారు. మిగిలిన ఒక పడకలో హెచ్​సీబీ, హెచ్​సీఎస్ వైరస్ ఉన్న రోగులకు కేటాయించారు. జిల్లాలో ఒకే డయాలసిస్ కేంద్రం ఉండటంతో కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రాంతాల రోగులు నుంచి వస్తున్నారు.

నాగర్​కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మార్చడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు రక్తశుద్ధి కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించడానికి పడకల స్థాయిని పెంచాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా మొత్తంగా 53 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. ఒక్కో రోగి వారంలో రెండు, మూడుసార్లు రక్తం శుద్ధి చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో రక్త శుద్ధి కేంద్రం వద్ద నమోదు చేసుకున్న 50 మందికి మాత్రమే షిఫ్ట్​ల ద్వారా 24 గంటలు డయాలసిస్ చేస్తున్నారు. ఒక్కొ బాధితుడికి రక్త శుద్ధి చేయాలంటే సుమారు నాలుగు గంటలు సమయం పడుతుంది. ఇవే కాక రక్తం శుద్ధి చేయించుకోవడానికి వివరాల నమోదు చేసుకొని వేచి చూస్తున్నావారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నమోదైన 50 మందిలో ఎవరైనా ట్రాన్స్​ఫర్​ కావడం, మృతి చెందడం జరిగితే వారి స్థానంలో మరొకరిని నమోదు చేసుకొని ఈ సేవలందిస్తున్నారు.

దీనికి చాలా కాలం పడుతుంది. తీవ్ర అస్వస్థత ఉన్నవారు హైదరాబాద్, జడ్చర్ల, మహబూబ్​నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లి రక్తం శుద్ధి చేయించుకుంటున్నారు. ఒక్కసారి వాళ్లకు సుమారు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఖర్చవుతుంది. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రంలో ఒక్కోసారి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో బాధితులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

బయోమెట్రిక్ విధానం పెట్టడం ద్వారా వేలిముద్రలు సరిగ్గా పడక ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ రోగులకు బస్సు పాస్ సౌకర్యం ఉన్నప్పటికీ చాలా మంది రోగులకు ఆ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచాలని బాధితులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.