ETV Bharat / state

దళిత బంధు నిధుల్లో గోల్‌మాల్‌.. చేతివాటం చూపుతున్న దళారులు

author img

By

Published : Apr 1, 2023, 9:27 AM IST

Irregularities in Dalit Bandhu funds
దళితబంధు నిధుల్లో గోల్‌మాల్‌

Dalit Bandhu scheme in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో దళితబంధు నిధుల్లో గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన రూ.10 లక్షల్లో.. లక్షా 30వేల వరకు పైరవీకారులే చేతివాటం ప్రదర్శించారని వాపోయారు. మంజూరైన యూనిట్లలో పరికరాలు నాసిరకం అందించి.. అందినకాడికి కాజేశారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు డబ్బులు తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేయలేదు. చారగొండ మండలంలో పంచాయతీ కార్యదర్శులు చేసిన సర్వేలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో దళితబంధు నిధుల్లో గోల్‌మాల్‌

Dalit Bandhu scheme in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధులో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మండలంలోని ప్రతి గ్రామంలోని దళిత కుటుంబాల్ని గుర్తించి రూ.9 లక్షల 90 వేలు మంజూరు చేశారు. ఈ మేరకు 1708 యూనిట్లు మంజూరు కాగా 1601 యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. తమకు దక్కాల్సిన 10 లక్షల విలువైన యూనిట్లు అందలేదని లక్షా 30వేలు మధ్య దళారుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. తొలుత పశువులు, డైరీ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు షెడ్లు నిర్మించుకున్నారు. యూనిట్లు మార్చుకుంటే నేరుగా డబ్బులే ఇస్తామని చెప్పిన దళారులు దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షలు తీసుకుని కేవలం 8లక్షలే ముట్టజెప్పారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు .

లబ్ధిదారులకు నాసిరకం పరికరాలు: వాస్తవానికి దళితబంధు ద్వారా వచ్చిన డబ్బుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి దళారుల చేతివాటంతో చాలీచాలని సొమ్ముతో చాలా మంది స్థలాలు కొనుగోలు చేశారు. మర్రిపల్లి తండాలో దళితబంధు కింద ఇచ్చిన ట్రాక్టర్లు, టెంట్ హౌజ్, సెంట్రింగ్ పరికరాలు నాసిరకంగా ఉన్నాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ముందు నాణ్యమైన ట్రాక్టర్లు చూపించి, ఆ తర్వాత నాసిరకానివి ఇచ్చి చేతులు దులుపుకున్నారని లబోదిబోమంటున్నారు. దమ్ము చక్రాలు లేక ట్రాక్టర్లను ఇంటి ముందు అలంకార ప్రాయంగా పెట్టుకున్నామని మర్రిపల్లి తండాలోని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాల కారణంగా ఉపాది పొందలేకపోతున్నాం: కొందరికి టెంట్ హౌజ్ యూనిట్లు మంజూరయ్యాయి. 10లక్షల్లో జీఎస్​టీ పేరుతో లక్షా 40వేలు ముందుగానే మినహాయించుకుని మిగిలిన డబ్బుకి టెంట్‌హౌజ్‌ సామాను ఇచ్చారు. వంగిపోయే బేసిన్లు, గిన్నెలు, గరిటెలు, చీకుడు పట్టి చిరిగిపోయిన టెంట్లు ఇచ్చారని లబ్ధిదారులు వాపోయారు. ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చినా, దళితబంధు అక్రమాల కారణంగా ఉపాది పొందలేకపోతున్నామని ఉసూరుమంటున్నారు. ఈనాడు-ఈటీవీలో ప్రసారమైన కథనాల ఆధారంగా దళితబంధులో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిపై పంచాయతీ కార్యదర్శులు సర్వే చేపట్టారు.

మరింత లోతుగా సమగ్ర విచారణ అవసరం: లబ్దిదారులు డబ్బులు తీసుకున్నారే తప్ప యూనిట్లు ఏర్పాటు చేసుకోలేదని తేలింది. ఏర్పాటైన యూనిట్లలోనూ అన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. మంజూరైన యూనిట్లు పూర్తిగా చేతికందలేదని లబ్దిదారులు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలు, మధ్యదళారులు చేసిన మోసాల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలు వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చారగొండ దళితబంధులో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. బాధ్యులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.