ETV Bharat / state

రామప్ప సరస్సుకు నీటి విడుదల.. మునిగిన పంట పొలాలు

author img

By

Published : Feb 23, 2023, 3:31 PM IST

నీట మునిగిన పంట పొలాలు
నీట మునిగిన పంట పొలాలు

crops were submerged in mulugu district: పంటలు పండించేందుకు నీళ్లు లేకపోతే అన్నదాతలు ఆవేదన చెందుతారు. కానీ ములుగు జిల్లాలో నీటిపారుదల అధికారులు సరస్సు నింపుతున్నందుకు కొన్ని గ్రామాల రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించేందుకు దేవాదుల పైపుల ద్వారా అధికారులు సరస్సులోకి నీళ్లు వదలడంతో వేసిన వరి నాట్లు నీటిమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

crops were submerged in mulugu district: వర్షాకాలం పంట లేకపోయినా యాసింగి పంటైనా పండించుకుందామని రైతులు ఆశగా ఎదురుచూశారు. తేలిన భూముల్లో నాట్లు వేసి సంతోషంగా ఉండే తరుణంలో గోదావరి నది నుంచి దేవాదుల పైపుల ద్వారా సరస్సుకు నీరు వదలడంతో నాటు వేసిన భూములు నీట మునిగాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రామప్ప సరస్సు ఆయకట్ట కింద రెండు వేల ఎకరాల వరకు పంటలు పండిస్తున్నారు.

మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు సరస్సు నిండుకుండలా మారి మత్తడి పోసింది. వర్షాకాలంలో భూములు నీట మునగడంతో రైతులు నాట్లు వేయలేదు. ప్రస్తుతం యాసంగి పంటైనా పండించుకుందామంటే ఆయకట్టు రైతులకు సమాచారం ఇవ్వకుండానే నీటిపారుదల అధికారులు గోదావరి జలాలను వదిలారు. సరస్సులో నిల్వ చేసిన నీటిని పైపులైన్ ద్వారా నల్లబెల్లి, నర్సంపేట, గణపురం, ధర్మసాగర్ మండలాల్లోని చెరువులకు పంపించేందుకు రామప్ప సరస్సును నింపుతున్నారు.

నాటు వేసిన తర్వాత సరస్సులు నింపడంతో పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని అన్నదాతలు వాపోతున్నారు. భూములు నీట మునగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటే.. పంటలు పండించుకుంటామని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహకరించపోతే ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

"పండించుకుని బతుకుదామనుకున్నాం. సాగునీటి శాఖాధికారులు ఎటువంటి సమాచారం అందించకుండా నీటిని వదిలారు. దీంతో మా పంట పొలాలన్ని నీట మునిగాయి. మేం నాట్లు వేసి ఇరవై రోజులు అవుతోంది. నాట్లు పచ్చబడ్డాయి. నీళ్లు వదలడంతో మా పంట పొలాలన్ని నీట మునిగాయి. పంట పండించుకోవడానికి మాకు వేరే ప్రాంతంలో కూడా భూములు లేవు. మాకు నాలుగు సంవత్సరాల నుంచి వర్షపాతం ఎక్కువగా ఉండి మా పంటలన్నీ మునిగిపోయాయి. కనీసం ఈ యాసంగైనా పంట పండితాయనే నమ్మకంతో నాట్లు వేస్తే గవర్నమెంట్​ నీళ్లు విడిచి వేసిన నాట్లు మునిగాయి". -రైతుల ఆవేదన

రామప్ప సరస్సుకు నీటి విడుదల.. మునిగిన పంట పొలాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.