ETV Bharat / state

'సీఎం, మాజీ సీఎం, టీవీ ఛానల్స్‌ వస్తేనే బయటికొస్తా - లేదంటే మీరు నన్ను కొడతారు'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 10:03 AM IST

Suraram Strange Robbery Incident
Suraram Strange Thief Incident

Suraram Strange Thief Incident : సూరారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లెదుటే దొంగ కనిపిస్తున్నా పట్టుకోలేని పరిస్థితి కల్పించాడు. సీఎం, మాజీ సీఎం, టీవీ ఛానల్స్ వస్తే గానీ లొంగిపోనని దొంగ భీష్మించుకుకూర్చున్నాడు.

Suraram Strange Thief Incident : సూరారంలోని తాళం వేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ దొంగను స్థానికులు వెంబడించి పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకుని చెరువులోకి దూకాడు. అక్కడే చెరువు మధ్యలో ఓ బండరాయిపై కూర్చున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సూరారం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని దొంగను బయటికి రమ్మని ఎంత నచ్చచెప్పినా మాట వినలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌(kcr), టీవీ ఛానల్స్‌ చెరువు వద్దకు వస్తేగానీ నీటిలో నుంచి బయటికి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

ఆన్​లైన్​ యాప్​లో పరిచయం అయ్యాడు, రూ.7.50 లక్షలు దోచుకున్నాడు

పోలీసులు: ఏయ్‌ మర్యాదగా చెరువులో నుంచి బయటికి వస్తావా? లేదా?

దొంగ: నేను రాను సార్. బయటికి వస్తే మీరు కొడతారు.

పోలీసులు: నిన్నేం కొట్టం. రా బయటికి

దొంగ: సీఎం, మాజీ సీఎం, టీవీ ఛానల్స్‌ వారు చెరువు దగ్గరికి వస్తేనే నేను బయటికి వస్తా.

పోలీసులు: నువ్వు బయటికి వచ్చేలోగా వాళ్లను రప్పిస్తాం. రా ఇక. నీకు పుణ్యముంటుంది.

దొంగ: సార్‌ మీరు ఎంత చెప్పినా వారంతా వచ్చే దాకా నేను చెరువులోనే ఉంటా.

పోలీసులు: రాత్రి 8 అవుతుంది. రా.. దోమలు కుడతాయి, పాములు కరుస్తాయి. బయటికి రా నిన్నేమీ కొట్టం.

దొంగ: నేను రానంటే రాను సార్.

Suraram Strange Robbery Incident : సూరారం పోలీస్ స్టేషన్​ పరిధిలోని శివాలయనగర్‌లో నందు, నాగలక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. శుక్రవారం వీరు ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం 4.30 వేళ వారి రెండో కుమార్తె ఇంటికి వచ్చే సరికి బయట గేటుకు తాళం వేసి ఉండగానే, ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా పడక గదిలో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటమే కాకుండా ఓ వ్యక్తి అందులో కూర్చుని డబ్బులు లెక్కిస్తూ కన్పించాడు.

వెంటనే ఆ బాలిక భయపడి దొంగ దొంగ అంటూ కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. ఆ వ్యక్తి చోరీ చేసిన ఇంటి నుంచి తప్పించుకుని పారిపోతుండగా స్థానికులు పట్టుకునేందుకు వెంబడించారు. దీంతో పెద్ద చెరువులోకి దూకిన ఆ దొంగ ఓ బండరాయిపై ఎక్కి కూర్చున్నాడు. స్థానికుల సమాచారంతో సూరారం ఎస్సై వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకుని అతన్ని చెరువులో నుంచి రమ్మని బతిమాలినా బయటకు రాలేదు. రాత్రి 8.30 గంటలకు అడ్మిన్‌ ఎస్సై నారాయణసింగ్‌ కూడా చెరువు వద్దకు చేరుకుని మైకులో హెచ్చరిస్తూ బయటికి రప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 12.30 గంటల వరకు పోలీసులు చెరువు వద్దనే వేచి ఉన్నారు. మరోవైపు తమ కష్టార్జితం రూ.20వేల వరకూ దొంగ ఎత్తుకెళ్లాడని నాగలక్ష్మి, నందు దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపార సంస్థలు మూసేసినా లావాదేవీలన్నీ పేపర్‌పైనే - జీఎస్టీతో 40 కోట్లు నొక్కేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.