రెండోరోజూ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు.. ఇంతకీ ఐటీ ఏం తేల్చిందంటే?

author img

By

Published : Nov 23, 2022, 8:07 PM IST

Updated : Nov 23, 2022, 8:53 PM IST

telangana latest news

IT raids at Mallareddy properties: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లక్ష్యంగా ఆదాయపన్నుశాఖ సోదాల పర్వం కొనసాగుతోంది. రెండ్రోజులుగా మంత్రి నివాసం, ఆయనకు చెందిన సంస్థలతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో వారి ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించిన ఐటీశాఖ... పలుకీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి కుమారుడు అస్వస్థతకు గురికాగా... ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

రెండోరోజూ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు.. ఇంతకీ ఐటీ ఏం తేల్చిందంటే?

IT raids at Mallareddy properties: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మంత్రి కేంద్రంగా చేసుకుని ఆదాయపన్నుశాఖ పంజా విసరటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా సాగుతున్న ఈ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలంరేపుతున్నాయి. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు అదే ప్రాంతంలో ఉండే ఆయన సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి ఇళ్లలో ఈ తనిఖీలు సాగుతున్నాయి.

విస్తృత తనిఖీలు... అదేవిధంగా... మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్దకుమారుడు మహేందర్‌రెడ్డి, కొంపల్లిలో ఉండే చిన్నకుమారుడు భద్రారెడ్డి ఇంటిలో ఐటీశాఖ తనిఖీలు జరుపుతోంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్‌ కళాశాల, సూరారంలోని మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య, దంత కళాశాలల్లో ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ...ఐటీ దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల లావాదేవీలతో సంబంధాలున్నాయనే సమాచారంతో.. క్రాంతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో...సోదాలు నిర్వహించారు.

65 బృందాలు... హైదరాబాద్‌ రీజియన్‌తో పాటు ఒడిశా, కర్ణాటక రీజియన్ల నుంచి ఐటీ అధికారులను, సిబ్బందిని రప్పించి దాడుల్లో భాగస్వామ్యం చేశారు. 2 వందలకు పైగా అధికారులు, సిబ్బంది.... 65 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్, చెల్లింపులపై..... ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను చెల్లించని నగదు చలామణి అవుతున్నట్లు ప్రాధమికంగా గుర్తించి కేసు నమోదు చేసి... సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో సోదాలు జరిపి.... ఏ మేరకు ఆదాయం వస్తోంది.... ఎంత మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాలి.... ? ఇప్పుడు చెల్లిస్తున్నదెంత....? తదితర వివరాలను నిగ్గు తేల్చనున్నారు. ఐటీ వర్గాల సమాచారం మేరకు నగదు, బంగారం, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లతో పాటు ఇతర ప్రాంతాలల్లోనూ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

రేపు కూడా జరిగే అవకాశం... ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లా రెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్లు ఆధారాలు సేకరించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు, మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్లు పేర్కొన్నారు. నిన్న, ఇవాళ రెండు రోజులు ఇప్పటి వరకు చేసిన సోదాలల్లో రూ.6 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సోదాలు మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశం ఉండగా... ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా స్థిరాస్థులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్లు...ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండడంతో ఆక్కడ సోదాలు చేసినట్లు వెల్లడించారు.

పనిమనిషికి ఫిట్స్... సోదాల వేళ.... మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పుతో పాటు భుజం నొప్పి రావటంతో కుటుంబసభ్యులు ఆయనను సూరారంలోని మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.... ఒత్తిడి కారణంగానే మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. కుమారుడు అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో ఐటీ అధికారులను నెట్టేసి.... ఆస్పత్రికి చేరుకున్నారు. మంత్రి నివాసంలో ఓ వైపు సోదాలు జరుగుతుండగా.... ఇంట్లో పనిచేసే మహిళ ఫిట్స్‌ వచ్చి పడిపోయింది. ఐటీ అధికారులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

మల్లారెడ్డి కోడలిపై ప్రశ్నల వర్షం దూలపల్లిలో మల్లారెడ్డి బంధువు ప్రవీణ్‌రెడ్డి నివాసంలో రెండో రోజు తనిఖీలు చేస్తుండగా... ప్రవీణ్‌ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తీసుకెల్లి... వైద్యపరీక్షల అనంతరం... ఇంటికి తీసుకువెళ్లారు. మల్లారెడ్డి వైద్య కళాశాలలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన కోడలు ప్రీతిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొంపల్లిలోని ప్రీతిరెడ్డి నివాసం నుంచి బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి ఇంటికి ఆమెను తీసుకువచ్చారు. వైద్య కళాశాలలు, సీట్ల విషయమై ఆరా తీస్తున్నారు. బోయిన్‌పల్లిలోని మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు... రాజశేఖర్‌రెడ్డి విదేశాల్లో ఉండటంతో ఆయన కుమార్తెను బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై బ్యాంకు లాకర్లను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే రెండ్రోజుల పాటు సోదాలు జరగగా.... రేపు కూడా ఈ తనిఖీలు జరిగే అవకాశం ఉంది. మొత్తం దాడుల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు గుర్తించిన అంశాలపై ప్రకటన చేయనున్నారు. ఐటీ దాడుల వేళ.... ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.