తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది - కేసీఆర్కు సహకరించేందుకే : మల్లికార్జున ఖర్గే

తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది - కేసీఆర్కు సహకరించేందుకే : మల్లికార్జున ఖర్గే
AICC Chief Mallikarjun Kharge Speech at Quthbullapur Congress Meeting : ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయిందని అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొన్నారు.
AICC Chief Mallikarjun Kharge Speech at Quthbullapur Congress Meeting : తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయిందని.. కేసీఆర్కు సహకరించేందుకే భారతీయ జనతా పార్టీ పోటీ నుంచి తప్పుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) విమర్శలు చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఒక్క కుటుంబం కోసమే సోనియాగాంధీ ఆనాడు తెలంగాణ ఇవ్వలేదని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే ఇచ్చారని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లో విపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐలను పంపుతారని.. కానీ తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై మాత్రం ఎలాంటి విచారణ ఉండదని విమర్శించారు. దీని ప్రకారం చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని అందరికీ అర్థమవుతుందన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ సంపదను మొత్తాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
Congress Meeting at Quthbullapur : తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం.. నేడు ఈ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.5 లక్షల అప్పు ఉంచారని మల్లికార్జు ఖర్గే ఆరోపించారు. కాళేశ్వరం(Kaleshwaram Project) పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కమీషన్లు దోచుకుని నాణ్యత లేని ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. నాణ్యత లేకపోవడంతో మూడేళ్లకే ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాణ్యత లేని ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ఓటర్లను ప్రశ్నించారు. అందుకే చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వచ్చీరాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Telangana Election Polls 2023 : ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదల బతుకులు మారతాయని చెప్పారు. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేసినా.. చివరికి తెలంగాణ ప్రజల ఆశ తీర్చింది మాత్రం సోనియా గాంధీనే.. ప్రత్యేక రాష్ట్రం(Special State) ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని నొక్కి చెప్పారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని బీఆర్ఎస్ చెప్పుకుంటుందని.. ఇచ్చారా అని ప్రశ్నించారు.
"తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది. కేసీఆర్కు సహకరించేందుకే బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి. ఒకే కుటుంబం కోసమే సోనియాగాంధీ ఆనాడు తెలంగాణను ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఇచ్చారు." - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసం పోరాటం : ప్రధాని మోదీ తెచ్చిన అన్ని బిల్లులకు ఇక్కడ కేసీఆర్ మద్దతు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని రేవంత్రెడ్డి మాటిచ్చారు. మోదీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. నేడు తెలంగాణలో లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. హైదరాబాద్ను ఐటీ కేపిటల్గా చేసిందే హస్తం పార్టీ అన్నారు.
