రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతోంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి ఓ రైతు ఇల్లు చెరువైంది. తెల్లవారుజామున ఆకస్మాత్తుగా గ్రామంలోని అమృత అనే మహిళా రైతు ఇంటి ముందు నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది.
గోదావరి నీరు ఒక్కసారిగా పైకి ఎగిసిపడడం వల్ల... పెద్దపెద్ద బండరాళ్లు ఇంటి పడి రేకులు ధ్వంసమయ్యాయి. గోదావరి నీళ్లు వరదల వచ్చి ఇంటిని ముంచెత్తాయి. ఇంట్లో ఉన్న పత్తి తడిసి ముద్దయింది. నిత్యావసర సరుకులతో పాటు వస్తువులన్నీ నీట మునిగాయి. ఈ ఘటనలో అమృత చిన్న కొడుకుపై రాళ్లు పడటం వల్ల స్వల్పంగా గాయపడ్డాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదం జరుగిందని... పైపులైను పగలడం ఇది రెండోసారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నీటి సరఫరాను ఆపేయించారు. రైతు ఇంట నిలిచిన నీటిని తీసేయించారు. బాధితురాలి దుస్థితిని చూసి తమకు తోచినంత నగదు సాయం చేశారు.