ngt team: ముగిసిన పర్యటన... నివేదిక ఇవ్వనున్న సంయుక్త విచారణ కమిటీ

author img

By

Published : Sep 17, 2021, 8:31 AM IST

ngt

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన (national green tribunal committee) సంయుక్త విచారణ కమిటి రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండోరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని కర్వెన, ఉదండపూర్ జలాశయంలో ప్రాజెక్టు పనులను పరిశీలించిన కమిటీ సభ్యులు.. పర్యావరణ నిబంధనల అమలుపై ఆరా తీశారు. ప్రాజెక్టు అనుమతులు, పర్యావరణ అనుమతులు ఉన్నాయా? మొరంమట్టి, నల్లమట్టి తరలింపులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఇతర అంశాలపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారిక నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న కమిటీ సభ్యులు...ట్రైబ్యునల్​కు నివేదిక సమర్పించనున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ కమిటీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన కోస్గి వెంకటయ్య గ్రీన్ ట్రైబ్యునల్​లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్, వాస్తవ పరిస్థితులపై నివేదిక కోరుతూ వివిధ శాఖల నిపుణులతో సంయుక్త విచారణ కమిటీని నియమించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కమిటీ 15వ తేదీన నాగర్​కర్నూల్ జిల్లాలో, 16న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించింది. రెండో రోజు పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు మహబూబ్​నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వేన జలాశయం 13వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా చిత్రాలను తిలకించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దృశ్య సమీక్ష నిర్వహించారు. జడ్చర్ల మండలం పరిధిలో నిర్మాణం చేస్తున్న ఉదండాపూర్ జలాశయం పనులను పరిశీలించారు. జడ్చర్ల, నవాబుపేట మండలాల నుంచి నల్లమట్టిని తరలించిన చెరువులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువులు నుంచి ఉండడంతో అధికారుల వద్ద కమిటీ సభ్యులు సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ప్రశ్నల వర్షం.. పొంతనలేని సమాధానాలు..!

ప్రాజెక్టు అనుమతులు, పర్యావరణం, నాణ్యత ప్రమాణాలపై కమిటీ లోతుగా వివరాలు సేకరించింది. సాగునీరు, మైనింగ్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులను కమిటీ సభ్యులు వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓ దశలో అధికారులు చెప్పే సమాధానాలకు పొంతన లేకపోవడంతో ప్రాజెక్టు పనులపై సమన్వయం కొరవడినట్లు తెలుస్తోందని కమిటీ సభ్యులు వ్యాఖ్యనించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? ఎప్పుడూ తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? పర్యావరణ అనుమతులున్నాయా? మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో తాగునీటి కోసం ప్రాజెక్టు పనులకు అనుమతులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. రెండో దశలో సాగునీటి కోసం పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తాగునీటికి అనుమతులు తీసుకోని సాగునీటికి పనులు ఎందుకు చేపట్టారని కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం.

అన్ని కోణాల్లోను..

కట్ట నిర్మాణానికి ముంపు ప్రాంతాల నుంచి తీసిన మొరంమట్టిని వాడుతున్నట్లు అధికారులు వివరించారు. మైనింగ్ అనుమతులు ఉన్నాయా..? నల్లమట్టిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? సీనరేజీ ఛార్జీలు చెల్లిస్తున్నారా? వంటి ప్రశ్నలు గుప్పించారు. చెరువుల్లో పూడికమట్టిని కట్ట నిర్మాణానికి తరలించామని జిల్లా కలెక్టరు వెంకట్రావు అధికారులకు వివరించారు. అక్రమంగా మట్టి తరలింపు ఎక్కడా జరగలేదా అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నించగా, మట్టికి సంబంధించిన సీనరేజీ ఛార్జీలను మైనింగ్ శాఖకు చెల్లించినట్లు చెప్పారు.

పిటీషన్​లో ఆరోపణలు, వాస్తవ పరిస్థితులపై నివేదిక

మొదటి రోజు కమిటీ నార్లాపూర్, ఏదుల, వట్టెం జలాశయాలు, పంప్​హౌజ్​ల నిర్మాణాలను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పర్యావరణ అటవీశాఖ శాస్త్రవేత్త అరోకియా లెనిన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు శాస్త్రవేత్త పూర్ణిమ, తెలంగాణ గనులు, భూగర్భ శాఖ సంచాలకులు రోనాల్డ్ రోస్, నీరి సంస్థ శాస్త్రవేత్త మేఘనాథన్, సీడబ్య్లూసీ సంచాలకులు రమేశ్​ కుమార్, నోడల్ ఎజెన్సీ కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతంగ్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పిటిషన్ దారులు తమ అభ్యర్థనలో చేసిన ఆరోపణలు, వాస్తవ పరిస్థితులపై కమిటీ సభ్యులు ట్రైబ్యునల్​కు నివేదిక సమర్పించనున్నారు.

ఇదీ చూడండి: పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.