ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

author img

By

Published : Mar 7, 2021, 8:51 AM IST

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఓటర్ల కోసం పోలింగ్‌ కేంద్రాలు ఎంపిక చేశారు. జిల్లాకు ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. పోలింగ్ కేెంద్రాలలో అన్ని వసతులున్నాయా లేదా అధికారులు నిర్ధరించుకున్నారు.

Hyderabad-Rangareddy-Mahabubnagar The authorities are all set for the Graduate Legislative Council elections
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా 1,19,367 ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల కోసం పోలింగ్‌ కేంద్రాలు ఎంపిక చేశారు. ఇప్పటికే కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులున్నాయా లేదా అధికారులు నిర్ధరించుకున్నారు. మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ఫ్యాన్లు, ర్యాంపులు సహా ఇతర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భధ్రతాపరంగా పోలింగ్‌ నిర్వహణకు అనువైన వాతావరణం ఉందా లేదా ఆరా తీశారు.

పోలింగ్‌ కేంద్రాలున్న ప్రాంతాలను రూట్లుగా విభజించి రూట్‌ ఆఫీసర్లు, సెక్టోరల్‌ అధికారులను ఇప్పటికే నియమించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఒక పోలింగ్‌ అధికారి, సహాయ పోలింగ్‌ అధికారి, మరో ఇద్దరు సిబ్బంది ఉంటారు. వీరి ఎంపిక పూర్తయి ఎన్నికల నిర్వహణపై తొలిదశ ఎన్నికల శిక్షణను పూర్తి చేసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ రెండో దశ ఎన్నికల శిక్షణ పూర్తి కానుంది. పోలింగ్‌ కోసం అవసరమైన సామగ్రిని హైదరాబాద్‌ నుంచే జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. అదనపు అవసరాలుంటే స్థానికంగా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచారు. ఇవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో తనిఖీ బృందాలు సైతం ఇప్పటికే రంగంలో ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు సహా ఎన్నికల నిర్వహణపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటించేలా చూడటంతోపాటు శానిటైజర్లు, మాస్కులు పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు.

అచ్చంపేట తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్న సిబ్బంది

జంబో బ్యాలెట్‌ పెట్టెలు :

ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండటంతో బ్యాలెట్‌ పత్రం దినపత్రిక పరిమాణంలో పెద్దదిగా ఉండనుంది. ఈ బ్యాలెట్‌ పత్రాలు వేసేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులు అవసరం. అందుకే గత ఎన్నికల్లో వాడిన జంబో బ్యాలెట్‌ పెట్టెలతోపాటు కొత్తవి తయారు చేసి ఆయా జిల్లాలకు ఇప్పటికే చేరవేశారు. ఐదు జిల్లా కేంద్రాలకు ఇప్పటికే జంబో బ్యాలెట్‌ పెట్టెలు చేరాయి.
అవగాహన :

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకునేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ పోలింగ్‌ బూత్‌ వారీగా బూత్‌ స్థాయి అధికారులు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పంపిణీ పూర్తవనుంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు బ్యాలెట్‌ పత్రాలు చేరగా.. మిగిలిన జిల్లాలకూ ఒకట్రెండు రోజుల్లో చేరనున్నాయి. ఎన్నికలకు ముందే ఓటు వేసే విధానంపై డమ్మీ బ్యాలెట్‌ పత్రాలతో మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 80ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, కొవిడ్‌ బారిన పడినవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అధికారులే ఓటర్ల వద్దకు వెళ్లి ఓటును స్వీకరిస్తారు.

వృద్ధులు.. దివ్యాంగుల కోసం

80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ను అమలు చేస్తున్నాం. 12 డిలో దరఖాస్తు చేసుకున్నవారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిస్తున్నాం. వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి వద్దకే వెళ్లి పోలింగ్‌ అధికారి సమక్షంలో ఓటును స్వీకరించి భద్రపరుస్తాం. జిల్లా వ్యాప్తంగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాం. ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి అమలు కోసం నిఘా బృందాలు ఇప్పటికే రంగంలో ఉన్నాయి.

- సీతారామారావు, సహాయ రిటర్నింగ్‌ అధికారి, మహబూబ్‌ నగర్‌ జిల్లా

ఇదీ చూడండి: రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కు చేరే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.