ETV Bharat / state

ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసుల బ్రేక్‌.. వైఎస్‌ షర్మిల అరెస్ట్

author img

By

Published : Feb 19, 2023, 8:50 AM IST

Updated : Feb 19, 2023, 11:39 AM IST

YS sharmila arrested : వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. మహబూబాబాద్‌లో ఆమెను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని షర్మిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

sharmila arrest
sharmila arrest

YS Sharmila Arrested: వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల అరెస్టయ్యారు. శాసనసభ్యులు శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పాదయాత్ర అనుమతిని రద్దు చేశారు. అనంతరం షర్మిలను హైదరాబాద్‌ తరలించారు.

తెల్లవారుజాము నుంచే బీఆర్‌ఎస్‌ శ్రేణులు షర్మిల బస చేసిన ప్రాంతం మహబూబాబాద్ మండలం బేతాలు శివారుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ మండలం భజన తండా వద్ద 365 జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ధర్నా చేపట్టారు. షర్మిల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి కనిపించడంతో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి షర్మిల పాదయాత్ర అనుమతిని రద్దు చేశారు. బేతాలు శివారులో బస్సులో ఉన్న షర్మిల కిందకు దిగకపోవడంతో అదుపులోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరకు బస్సును తరలిస్తామని హెచ్చరించడంతో షర్మిల బయటకు వచ్చారు. దాంతో షర్మిలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసుల బ్రేక్‌.. వైఎస్‌ షర్మిల అరెస్ట్

అసలు ఏం జరిగిందంటే.. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ పరుష పదజాలంతో తిట్టారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు లూనావత్‌ అశోక్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు నేడు షర్మిలను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

గతంలోనూ ఇలాగే..: పాదయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పోలీసులు గతంలోనూ షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో షర్మిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్‌ నేతలపై షర్మిల అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా.. ఉన్నత న్యాయస్థానం మండిపడింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని షర్మిలకు హితవు పలికింది. అనంతరం పాదయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. షర్మిల సైతం గతంలో ఇచ్చిన షరతులకు లోబడి యాత్ర కొనసాగించాలని సూచించింది. హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడంతో గత నెల 28 నుంచి షర్మిల తిరిగి తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో యాత్ర సాగుతుండగా.. నిన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో దూషించారన్న కేసుతో యాత్రకు మళ్లీ బ్రేక్‌ పడింది.

ఇవీ చూడండి..

బీఆర్ఎస్ దాడులకు భయపడను: వైఎస్‌ షర్మిల

'విశాఖ ఉక్కుపై మాట్లాడే కేటీఆర్‌కు మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలు కనిపించడం లేదా'

Last Updated :Feb 19, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.