TULARAM PROJECT: తులారాం క'న్నీటి వ్యథ'.. అక్కడ నీరు పుష్కలం.. కానీ ఆయకట్టు నిష్ఫలం!

author img

By

Published : Aug 10, 2021, 6:08 PM IST

TULARAM PROJECT repairs, farmers worry about TULARAM PROJECT problems

వృథాగా ప్రవహించే వరద నీటికి అడ్డువేసి 16 ఏళ్ల కిందట తులారాం ప్రాజెక్టు నిర్మించారు. ఫలితంగా ఆయకట్టు సస్యశ్యామలం అయింది. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాలువలు అస్తవ్యస్తంగా మారి సాగు నీరంతా వృథాగా పోతోంది. సమృద్ధిగా నీరు ఉన్నా... ఒక్కపంటకే నీరు రావడం గమనార్హం. ప్రజాప్రతినిధుల హామీలు మాటలకే పరిమితమయ్యాయని ఆయకట్టు రైతులు వాపోయారు. తులారాం ప్రాజెక్టుపై కరుణ చూపాలని వేడుకుంటున్నారు.

మరమ్మతులకు నోచుకోని తులారాం ప్రాజెక్టు

చుట్టూ పచ్చని చెట్లు... ఎత్తైన కొండల నడుమ వృథాగా ప్రవహించే వరద నీరు. ఆ నీటికి అడ్డుకట్ట వేసి... ఆయకట్టుకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో 16 ఏళ్ల కిందట తులారాం ప్రాజెక్టు నిర్మించారు. సాగునీటి కాలువలు నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉన్నా... వృథా అవుతూ ఆయకట్టులో కరవే సంభవిస్తోంది.

నీరున్న ఇబ్బందులే..

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వినోభానగర్ సమీపంలోని తులారాం ప్రాజెక్టు మరమ్మతులను నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వట్టేవాగుపై ప్రాజెక్టు నిర్మించాలని మహబూబాబాద్‌కు చెందిన బీఎన్ గుప్తా నాలుగు దశాబ్దాలు పోరాడారు. 2003లో నాటి ప్రభుత్వం రూ.11.50 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 2005లో పూర్తి చేశారు. 21 అడుగుల ఎత్తులో 0.50 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా ఆనకట్టను నిర్మించారు.

ఆయకట్టు సస్యశ్యామలం

ఈ ప్రాజెక్టుతో వినోభానగర్, గౌరారం, బాలజీపేట్, త్రీత్రీ తండా, బాల్యతండా, జగనాతండా, బండ్లకుంట గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఆనకట్ట కింద ఉన్న ఏడు గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిండేలా 12 కిలోమీటర్ల మేర పంట కాలువలు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

వృథాగా సాగునీరు

ఏటా ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు చేరుతున్నా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించే పరిస్థితి లేదు. కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. కొన్నిచోట్ల కాలువ అసంపూర్తిగా నిర్మించడం.. కాలువల్లో పేరుకుపోయిన పూడిక మట్టిని తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ప్రాజెక్టు సమీపంలోని నిర్మించిన సిమెంట్ కాలువకు రంధ్రాలు పడడం.. అక్కడక్కడ పగుళ్లు రావడం వల్ల నీరు వృథాగా పోతోంది. కొన్నిచోట్ల చెట్లపొదలతో కూరుకుపోయింది.

తులారాం ప్రాజెక్టు ద్వారా 2005 నుంచి నీరు అందుతోంది. కానీ ఒకే కారుకు సాగు నీరు వస్తోంది. ఎత్తు పెంచితే రెండో పంటకు నీరు ఉంటుంది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది. కాలువకు అక్కడక్కడా గండ్లు పడి నీరు వృథాగా పోతోంది. కాలువలు పూడిక తీయడానికి మనుషులు కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పినా ఇప్పటికీ ఆచరించలేదు. ఇప్పటికైనా స్పందించి కాలువ బాగు చేయాలని కోరుతున్నాం.

-ఆయకట్ట రైతులు

రైతుల విజ్ఞప్తి

కాలువలకు మరమ్మతులు చేపట్టి.. ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పలుసార్లు హామీ ఇచ్చారే తప్పా... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 21 అడుగుల ఎత్తుతో 0.50 టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఆనకట్ట ఎత్తును మరో 15 అడుగులకు పెంచితే ఒక టీఎంసీ నీటి నిల్వ చేసే వీలుంటుందని అంటున్నారు. ఎక్కువ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని... ఆ దిశగా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: transgender: మార్పు కోసం.. హిజ్రాలకు సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.