ETV Bharat / state

Telangana MLC Elections Voting : ఆదర్శం.. వీల్ చైర్​లో వచ్చి ఓటేసిన ఎంపీటీసీ!

author img

By

Published : Dec 10, 2021, 2:11 PM IST

Telangana MLC Elections Voting, mptc madhav cast vote
వీల్ చైర్​లో వచ్చి ఓటేసిన ఎంపీటీసీ

కుమురంభీం జిల్లా జామ్ని ఎంపీటీసీ ఓటేసి... ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ ప్రమాదంలో వెన్నుపూస విరిగి... మంచానికే పరిమితమైన ఆయన... స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 50 కిలోమీటర్ల మేర ప్రయాణించారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని జామిని ఎంపీటీసీ మాధవ్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్యం పాలైనప్పటికీ వీల్ చైర్ సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి... ఓటేశారు. ఏడాది క్రితం శ్మశాన వాటికకు సంబంధించిన రేకుల షెడ్డు పనులు నిర్వర్తిస్తుండగా... గాలివానకు రేకుల షెడ్డు ఎంపీటీసీపై పడడంతో వెన్నుపూస విరిగి మంచానికి పరిమితమయ్యారు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచానికే పరిమితమైన ఆయన 50 కిలోమీటర్లు ప్రయాణించి... జిల్లా కేంద్రానికి చేరుకుని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

ఓటేసిన ప్రముఖులు

రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తదితర ప్రజా ప్రతినిధులు ఓటేశారు.

ప్రశాంతంగా పోలింగ్

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలింగ్ బూత్ నంబర్ 3 లో 208 ఓట్లు ఉండగా మొదటి రెండు గంటల్లోనే 149 ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొంతమంది దూరంగా ఉన్నట్లు సమాచారం. భైంసా ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 102 ఓటర్లు వున్నారు. ఉదయం 8 గంటల పోలింగ్ జరుగుతోంది. ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఓటేశారు. పోలింగ్ కేంద్రం వద్ద భైంసా ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, శాసనసభ్యులు ఆత్రం సక్కు ఓటేశారు.

పటిష్ఠ బందోబస్తు

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 69 మంది, కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి 96 మంది, మొత్తం జిల్లాలో 165 మంది, కాగజ్​నగర్ కౌన్సిలర్లు 30 మంది, ప్రజా ప్రతినిధులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా వాంకిడి మండల జడ్పీటీసీ అజయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ తీరును జెసి రాజేశం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: MLC Elections Voting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.