ETV Bharat / state

తీరని గిరి పుత్రుల దాహార్తి... అలంకారప్రాయంగా నల్లాలు

author img

By

Published : Nov 2, 2020, 8:20 PM IST

జల్, జంగిల్, జమీన్ కోసం 80 ఏళ్ల కిందట పోరాటం చేసిన గడ్డ అది. అయినా నాటి నుంచి నేటికీ ఆ గిరిపుత్రుల దాహార్తి తీరలేదు. ఆ పోరుగడ్డపై నీటి కోసం అడవి బిడ్డలు పడే ఇక్కట్లు వర్ణనాతీతం. మన్యం ముద్దుబిడ్డ కుమురం భీం వర్ధంతి నాడు అధికారులు ఆగమేఘాల మీద మంచి నీటి సరఫరా పనులు మొదలు పెట్టారు. తీరా చూస్తే మరుసటి రోజే ఆ నల్లాలు అలంకారప్రాయంగా మిగిలాయి. కుమురం భీం ఆశయాలు నేటికీ నెరవేరలేదని గిరిజనులు వాపోయారు.

drinking-water-problems-at-jodeghat-in-komaram-bheem-asifabad-district
తీరని గిరి పుత్రుల దాహార్తి... అలంకారప్రాయంగా నల్లాలు

జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో 80 ఏళ్ల కిందట పోరాటం చేసిన ఆ అడవి బిడ్డల దాహార్తి నేటికీ తీరలేదు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లో కుమురం భీం వర్ధంతి రోజు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టి 12 పోరు గ్రామాలకు తాగునీటిని అధికారులు అందించారు. మరుసటి రోజు నుంచి మాత్రం ఇక్కడ 'గిరి' జనం నీటి కష్టాలు షరా మామూలే. తెల్లవారగానే నల్లాలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఒక్కరోజు మురిపెం లాగా మళ్లీ గిరిజనులకు తాగునీటి ఇక్కట్లు తప్పలేదు.

గ్రామానికి ఒకే బోరు ఉండడం... కరెంటు ఉంటేనే అది పని చేయడం వల్ల పోరుగడ్డకు నీటి కొరత తప్పడం లేదు. మన్యం ముద్దుబిడ్డ కుమురం భీం ఆశయం ఇప్పటికీ నెరవేరడం లేదని గిరిజనులు వాపోయారు. 80 ఏళ్ల నుంచి తమ కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వాల వరకు ఎవరూ వారి కష్టాలను తీర్చలేదని అన్నారు. ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అడవి బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఈటీవీ కథనానికి స్పందన.. కదిలిన జిల్లా యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.