DGP Mahender reddy: 'తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'

author img

By

Published : Jun 28, 2021, 11:04 PM IST

dgp mahendar reddy

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender reddy) పర్యటించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి రివార్డ్స్ అందించారు.

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డీజీపీ మహేందర్​ రెడ్డి (DGP Mahender reddy) అన్నారు. మావోయిస్టుల నియామకాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కట్టడికి 31 డిస్ట్రిక్ట్​ గార్డ్స్​ ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతంలో నిరంతరం కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వివరించారు. కమ్యూనిటీ పోలీస్ ద్వారా ప్రజలకు నిరంతరం దగ్గరవడానికి కృషి చేస్తున్నారు. మావోల కట్టడి ఆపరేషన్​లో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాంతి భద్రతలకు నిలయంగా మారాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

లొంగిపోయిన వారికి పునరావాసం

కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే వైద్య సేవలు అందిస్తామని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులను వారికే ఇస్తామని తెలిపారు. మావోల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని లొంగిపోయేలా చూడాలని సూచించారు.

మావోయిస్టు సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొవిడ్​ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తెలంగాణ స్టేట్​ కమిటీ సెక్రటరీ హరిభూషన్​ కొవిడ్​తో మృతి చెందాడు. ఇప్పటికే ఎంతోమంది క్యాడర్స్​ మృతి చెందారు. వారితో పాటు మిగిలినవారు చనిపోకుండా ఉండాలంటే జనజీవన స్రవంతిలో కలవాలి.. పోలీసుల ఎదుట లొంగిపోవాలి. వారికి ఎలాంటి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. - మహేందర్​ రెడ్డి, డీజీపీ.

లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తాం: డీజీపీ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్​

నకిలీ పత్తి విత్తనాలు, గడ్డి మందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ (DGP Mahender reddy) హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 11 మందిపై పీడీయాక్ట్​ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రామగుండం కమిషనరేట్​లో​ ఆకస్మిక తనిఖీ

అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్​ను డీజీపీ ఆకస్మికంగా పర్యటించారు. నిర్మాణంలో ఉన్న పోలీస్ కమిషనరేట్ భవనం, అతిథి గృహం, గోదావరి ఖని వన్​టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణాలను పరిశీలించారు. గోదావరిఖని పోలీస్ స్టేషన్ రాష్టంలోనే మోడల్ పోలీస్ స్టేషన్ అని... జులైలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ అవసరం లేకుండా ప్రతి ఠాణాలో 30 శాతం మహిళ పోలీసులను నియమిస్తున్నామని డీజీపీ అన్నారు. డీజీపీ వెంట అడిషనల్ డీజీ శ్రీనివాస్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.