Theft at Bakery in Khammam : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత శనివారం కొందరు దొంగలు ఓ బేకరీలోకి చోరీకి వెళ్లారు. తమ పని ముగించుకున్న అనంతరం తాపీగా కేకు కోసుకొని పార్టీ చేసుకున్నారు. అంతేకాదు.. వేడుకలకు ఉపయోగించే పోపర్ (మెరుపు కాగితాలను వెదజల్లే టపాసు)లను పేల్చి మరీ వేడుక జరుపుకొన్నారు. అంతటితో ఆగకుండా బేకరీలోని స్వీట్లు, కేకులు, ఇతర తినుబండారాలు ఎత్తుకెళ్లారు.
పట్టణానికి చెందిన సాయిరాం స్వీట్స్, బేకరీ యజమాని కె.శశిధర్ శనివారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిచూడగా.. షట్టరు తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. ఫ్రీజర్లో ఉన్న కేకులు కోసుకొని తిన్న ఆనవాళ్లు కనిపించాయి. అక్కడే ఉన్న మిఠాయిలు, తినుబండారాలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. దొంగలు కేకులు కోసుకొని తిని, బిస్కట్లు, చాక్లెట్లు ఎత్తుకెళ్లారు. వేడుకలకు ఉపయోగించే సామగ్రితో సరదాగా గడిపినట్లు వెల్లడవుతోంది.
సుమారు రూ.20 వేల విలువైన మిఠాయిలు, తినుబండారాలు చోరీ అయినట్లు బేకరీ యజమాని పేర్కొన్నారు. దుకాణం తాళం పగులగొట్టి షట్టరు తెరిచేందుకు వాడిన పలుగును అక్కడే వదిలేశారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దొంగలు లోపలకు చొరబడిన సమయంలో కౌంటర్లో డబ్బులు లేవని, దీంతో ఇలా చేసి ఉంటారని యజమాని పేర్కొన్నారు.