ETV Bharat / state

Telangana Rains Updates : తొలకరి పలకరించే.. రైతులు పరవశించే

author img

By

Published : Jun 24, 2023, 7:07 AM IST

Telangana Monsoon News : ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతకు వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. ఓ వైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకంతోపాటు.. వానాకాలం సాగుకు సర్వసన్నద్ధమైనా వరుణుడి జాడలేక దిగాలుగా ఉన్న కర్షకులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. ఖమ్మం జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని.. వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాబోయే రెండు మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. దీంతో.. చినుకు లేక చింతగా ఉన్న రైతులకు ఉపశమనం దక్కింది.

Etv Bharat
Etv Bharat

తొలకరి పలకరించే.. రైతులు పరవశించే

Monsoon Arrived in Telangana : రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయంటూ వాతావరణ శాఖ ప్రకటించడంతో ఉభయ జిల్లాల రైతుల్లో వానాకాలం సాగు అన్నదాతల్లో ఆశలు నింపుతోంది. ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో... సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8ి లోమీటర్ల వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఫలితంగా దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి.. తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నట్లు వెల్లడించింది.

Kharif Crop Cultivation in Telangana : ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలోకి నైరుతి రుతుపవనాల రాక ఆరంభమైందని పేర్కొంది. దీంతో.. వాన కోసం ఎదురు చూస్తున్న కర్షకులకు భారీ ఊరట దక్కింది. వాస్తవానికి రెండు జిల్లాల్లోని రైతులు వానాకాలం సాగుకు.. దాదాపు నెల రోజుల కిందట నుంచే రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నుకోవడం, విత్తనాలు తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకున్నారు. కానీ వరుణుడి జాడలేకపోవడం వల్ల... రైతుల్లో కలవరం మొదలైంది. అదును దాటుతుందని కలవర పడ్డారు. ఇంకోవైపు ప్రభుత్వం ముందస్తు సాగును ఈ సారి తీసుకొచ్చింది. అకాల వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా సాగు సీజన్‌ను.. నెల రోజులు ముందుకు తీసుకొచ్చింది.

Telangana Rains Updates : ఈ మేరకు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించింది. కానీ వానలు సకాలంలో కురవకపోవడంతో.. ముందస్తు పంటల సాగు సాధ్యపడలేదు. అయితే.. తాజాగా నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తొలకరి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతపై... రేపో మాపో వరుణుడు కరుణ చూపనుండటంతో ఇక వ్యవసాయ పనులు జోరుగా సాగనున్నాయి.

Khammam Rains News Today : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వానాకాలం సీజన్ కన్నా... ఈ సారి పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాలు ఉన్నాయి. 2022 వానాకాలం సీజన్​లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని పంటలు కలిపి... 5 లక్షల 5 వేల 11 ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి దాదాపు లక్ష ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా ఉంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 6 లక్షల 2 వేల 116 ఎకరాల్లో సాగవుతాయని ప్రస్తుతం అంచనాలు ఉన్నాయి. జిల్లాలో ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం పెరగుతుందని వ్యవసాయ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది 1,62,100 ఎకరాల్లో పత్తి సాగైతే.. ఈ సారి ఏకంగా 2,14,302 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని పేర్కొంది. తర్వాతి స్థానంలో వరి... 1,65,025 ఎకరాల్లో సాగవుతుంది. ఖమ్మం జిల్లాలో 6.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. వరి 2,89,983 ఎకరాలు.. పత్తి 2,23,617 ఎకరాలు, మిర్చి 80 వేల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

'జూన్​ 15 వరకు దీర్ఘకాలిక విత్తనాలు విత్తుకోవచ్చు. అదే 25 వరకు అయితే స్వల్పకాలిక విత్తనాలను విత్తుకుంటే సరిపోతుంది. ఒకవేళ నారుమడి పోయడానికి అనుకూల సమయం లేనిచోట్ల నేరుగా వరి విత్తే విధానాన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు పొడిదుక్కుల్లో వెదజల్లడం ద్వారా.. ఇంకా సీడ్​ డ్రిల్​ ద్వారా వరి నేరుగా వరి విత్తుకోవచ్చు.' - విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి.

జిల్లాలోకి రుతుపనాల రాక ఆరంభంతో అక్కడక్కడా తేలికపాటి వానాలు మొదలయ్యాయి. ఓ మోస్తరు వాన కురిస్తే రైతులంతా విత్తనాలు మొదలుపెట్టనున్నారు. ముఖ్యంగా పత్తి సాగు ముమ్మరం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని... విత్తనాలు తెచ్చి సిద్ధం చేసుకోగా.. తొలకరి పలకరించడంతో ఉభయ జిల్లాల్లో జోరుగా పత్తి విత్తనాలు నాటే సందడి నెలకొననుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.