ఖమ్మం గుమ్మం నుంచే యుద్ధానికి సై అంటున్న పార్టీలు

author img

By

Published : Jan 11, 2023, 6:34 AM IST

Updated : Jan 11, 2023, 7:07 AM IST

Khammam district

Political Heat in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి. దేశరాజకీయ యవనికపై సత్తా చాటేందుకు.. ఖమ్మం గుమ్మం నుంచే బీఆర్​ఎస్ శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో మిగిలిన ప్రధాన ప్రతిపక్షపార్టీలన్నీ అక్కడినుంచే రాజకీయ సైరన్ మోగిస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల సందడికి, పార్టీల అశ్త్రస్త్రాలకు ఖమ్మం వేదికగా నిలుస్తుండటం రాజకీయంగా కాక పుట్టిస్తోంది.

ఖమ్మం గుమ్మం నుంచే యుద్ధానికి సై అంటున్న పార్టీలు

Political Heat in Khammam : ఖమ్మం జిల్లా రాజకీయ రణరంగానికి వేదికగా నిలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కాకరేపుతోంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్​ఎస్​.. దేశ రాజకీయ యవనికపై సత్తా చాటేందుకు తొలిమెట్టుగా ఖమ్మం జిల్లానే ఎంచుకుంది. ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేలా ప్రణాళికలు చేస్తోంది. 100 ఎకరాల స్థలంలో సభా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు... ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని మరో 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు.

అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యాచరణ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి భారీ బహిరంగసభ విజయవంతం చేస్తే.. ఆ ప్రభావం అధికంగా ఉంటుందని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండుఎన్నికల్లో ఒక్కస్థానానికే పరిమితమైన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆ సభను వినియోగించుకునేలా సమాయత్తం అవుతోంది. గత పరిస్థితులను అధిగమించి అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యాచరణ చేపట్టింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం: ఖమ్మంబహిరంగ సభ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ.. పార్టీపరంగా మరింత ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. 18న నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం కావాలంటే పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలకు చెక్‌పెట్టి నాయకులందరినీ ఒకేతాటిపైకి నడిపించేలా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార బీఆర్​ఎస్​ మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగానే రాజకీయ సైరన్ మోగిస్తున్నాయి.

పాదయాత్రకు సన్నద్ధమవుతున్న రేవంత్ రెడ్డి: నెలాఖరులో భద్రాద్రి రాములోరి దివ్యక్షేత్రం నుంచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనుండటం, ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖరావం ఆ జిల్లానుంచే పూరించినట్లవుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.

2018 ఎన్నికల్లో 6 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాజకీయంగా కార్యకర్తల బలం ఉండటం, సెంటిమెంట్‌గా పార్టీకి ఖమ్మం జిల్లా అండగా నిలవడంతో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ: రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ చెప్పుకొస్తున్న బీజేపీ.. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. కొందరు నేతలను పార్టీలో చేర్చుకొని ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచే పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అ‍ధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.

బలం నిరూపించుకునేలా ప్రణాళికలు: డిసెంబర్ 21న ఖమ్మం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. బహిరంగ సభ విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లోనూ బహిరంగ సభల నిర్వహణకు.. టీడీపీ సన్నద్ధమవుతోంది. పార్టీకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే మళ్లీ బలం చాటుకోవాలన్న కసితో.. వామపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సీపీఎం, సీపీఐ,న్యూడెమోక్రసీ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శులు ముగ్గురు ఆజిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అక్కడినుంచే బలం నిరూపించుకునేలా కార్యాచరణ మొదలుపెట్టాయి

జిల్లాలో రాజకీయ వేడి: ఇటీవలే సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీపీఐ ఇక్కడి నుంచే 98వ ఆవిర్భావ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించింది. రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేసేందుకు.. వైఎస్సార్​ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల.. ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఖమ్మంకు కూతవేటు దూరంలోని ఖమ్మం గ్రామీణం మండలం కరుణగిరిలో.. జిల్లా పార్టీ తొలి కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలకు నాందిగా ఖమ్మం జిల్లానే ఎంపిక చేసుకోవడంతో ఇప్పటి నుంచే జిల్లాలో రాజకీయ వేడిని రాజేస్తోంది.

ఇవీ చదవండి: నన్ను ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరుచేయలేరు పొంగులేటి

ఏపీకి సోమేశ్‌ కుమార్‌.. తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు

'60 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం.. ఒక్కసారిగా ఇళ్లు కూల్చేస్తే ఎలా?'.. జోషీమఠ్​ వాసుల ఆవేదన

Last Updated :Jan 11, 2023, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.