ETV Bharat / state

'పోడు పోరు'లో పసి పిల్లలు.. గుక్కపట్టి ఏడుస్తూ తల్లులతోపాటే జైలుకు...

author img

By

Published : Aug 7, 2021, 7:13 AM IST

Updated : Aug 7, 2021, 12:02 PM IST

అమ్మ ఒడిలోనే నిద్రిస్తున్నారు ఆ చిన్నారులు. అయినా ఇబ్బందిగా భావిస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..! పోడు భూముల కేసులో కోర్టుకు వెళ్లి అక్కడ గంటపాటు నిరీక్షించారు. అంతేనా అమ్మలతోపాటే.. జైలుకి కూడా వెళ్లారు.

jailed-children-along-with-their-mothers-in-the-khammam-land-issue
పోడు భూముల కేసులో.. తల్లులతో పాటు చంటిపిల్లలు జైలుకు..

అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన పసి మొగ్గలు... ఖమ్మం జిల్లా పోడు భూముల కేసులో న్యాయస్థానంలో తమ తల్లులతో పాటు గంట పాటు నిరీక్షించారు. గుక్కపెట్టి ఏడ్చారు. చివరికి తల్లులతో పాటే జైలుకు వెళ్లారు. సాక్షాత్తూ తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంలో శుక్రవారం ఖమ్మం కోర్టు ఆవరణలో ఈ దృశ్యం కనిపించింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌ పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కొందరిని గురువారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం మరో 9 మంది మహిళలను నిందితులుగా పేర్కొంటూ జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇందులో ముగ్గురు చంటి పిల్లల తల్లులు ఉన్నారు.

గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారులు.. చివరికి తల్లులతో పాటే జైలుకు

కేసీఆర్​కు నాయం అనిపిస్తాందా..!

మాయి అడవి భూములు. అవి నరుక్కోని చేన్లు ఎసినము. చేన్లేస్తే... అవి పత్తి సేన్లు. మనిషికి ముప్పై గుంటలు ఏశినం. మొత్తం ఊడబీకారు. మరి మేమెట్ల బతకాలి. మా పిల్లలు మేము. కేసీఆర్​కు నాయం అనిపిస్తాందా..! వద్దని కాళ్లమీద పడ్డాను. నెట్టేసారు నన్నే. - మౌనిక, బాధితురాలు

మా పిల్లలన్నా మంచిగ బతకాలి..

మా శేను మాకు కావాలంటే... మా మీద దాడి చేశినారు. మా శేనంతా పీకేశినారు. అయిదారెకరాలు. మాకు పిల్లలున్నరు కాబట్టి, మేమిట్ల బతుకుతున్నం కాబట్టి... మా పిల్లలన్నా మంచిగ బతకాలి. మా భూమి మాకొచ్చేటట్టు కావాలి. - కవిత, బాధితురాలు

శిశువులను ‘మిల్క్‌బేబీ’గా..

వారిలో ఎత్తెర మౌనికకు 3 నెలల శిశువు, ఆలపాటి కవితకు 8 నెలల శిశువు ఉన్నారు. మరో మహిళ రాణికి ఏడాది వయసున్న చంటి పాప ఉంది. ఈ ముగ్గురు తల్లులతోపాటు మరో ఆరుగురు మహిళలను పోలీసులు ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులైన తల్లులతోపాటు నెలల వయసున్న శిశువులను దానవాయిగూడెంలోని జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌ రిపోర్టులో శిశువులను ‘మిల్క్‌బేబీ’గా పేర్కొన్నారు.

తిరిగి ఉసురు తలుగుద్దో లేదో... !

ఆహార భద్రత కావాలా.. భూమి భద్రత కావాలన్నందుకు ఆళ్ల మీద 307 కేసు పెట్టి... ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీళ్లని జైలుకి పంపిస్తా ఉన్నరు. అందులో ముగ్గురు చంటిపిల్ల తల్లులున్నరు. మూడు నెలల పాప ఒకామె.. ఎనిమిది నెలల పాప ఒకామె.. అదే విధంగా సంవత్సరం పాప. తల్లితోపాటు పిల్లలు కూడా ఇవాళ జైలుకి పోవాల్సి వస్తోంది. ఫారెస్ట్ అధికారులకు కనికరం లేదు. పోలీసులకూ కనికరం లేదు. కేసీఆర్ ప్రభుత్వానికి అంతకంటే కనికరం లేదు. ఇయాళ తల్లీ పిల్లలను కూడా జైలుకి పంపిచ్చింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జైలుకి పంపిస్తే... తెలంగాణ కోసం అదానికి ఉసురు తగులుద్దని శాపం పెట్టినవాడు కేసీఆర్. ఇయాళ సెంటు భూమి కోసం పోరాడుతుంటే... తల్లీపిల్లలను జైలుకి పంపిస్తే ఎంతటి మరి తిరిగి ఉసురు తలుగుద్దో లేదో... ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

- పోటు రంగారావు, సీపీఐఎం(ఎల్​) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి

చంటి పిల్లల తల్లులపైనా పోడు కేసులా

పోడు భూముల స్వాధీనం పేరుతో అటవీ శాఖ అధికారులు చంటి పిల్లల తల్లులపైనా కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చూడండి: అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడు భూముల రైతులు.. ఉద్రిక్తత

ఇదీ చూడండి: Spandana: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. సరిహద్దుల నిర్ధరణకు సర్వే

Last Updated : Aug 7, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.