ETV Bharat / state

CLP Bhatti Padayatra : 109 రోజులు.. 1360 కిలోమీటర్లు.. నేటితో భట్టి 'పీపుల్స్ మార్చ్' ముగింపు

author img

By

Published : Jul 2, 2023, 7:15 AM IST

Bhatti Vikramarka Padayatra Conclude Today
Bhatti Vikramarka Padayatra Conclude Today

CLP Bhatti Padayatra Ends Today : ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర నేటితో ముగియనుంది. అదిలాబాద్‌ జిల్లాలో మొదలైన ఈ పాదయాత్ర 17 జిల్లాలు, 36 నియోజక వర్గాలు, 1360 కిలోమీటర్లు చుట్టివచ్చి ఖమ్మం చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా.. మంచిర్యాల, జడ్చర్లల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసిన భట్టి.. మూడోసారి ఇవాళ ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఆయన అనుచరులు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. భట్టి పాదయాత్ర అదే సభతో ముగియనుంది.

ఖమ్మం సభతో ముగియనున్న భట్టి 'పీపుల్స్​మార్చ్‌' పాదయాత్ర

Bhatti Vikramarka Padayatra Updates : రాహుల్​గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్రకు అనుబందంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి 30 అసెంబ్లీ నియోజక వర్గాలల్లో ఈ హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర చేశారు. అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క "పీపుల్స్‌ మార్చ్‌'' పేరున ఏకంగా 109 రోజులు 1360 కిలోమీటర్లు తన పాదయాత్రను కొనసాగించారు. ధరణి పోర్టల్‌ సమస్యలతో పాటు పోడుభూముల పట్టాలు, డబుల్‌ బెడ్​రూం ఇళ్లు ఇలా అనేక ప్రజాసమస్యలు పాదయాత్రలో భాగంగా ఆయనను కలిసిన ప్రజలు ఏకరువు పెట్టారు.

Bhatti Vikramarka Peoples March : ఈ ఏడాది మార్చి 16వ తేదీన పీపుల్స్​మార్చ్ పాదయాత్రను ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరి గ్రామంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్​రావ్‌ ఠాక్రే ప్రారంభించారు. మార్చి 19న అదే జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని భట్టి సందర్శించి నివాళులు అర్పించారు. ఏప్రిల్ 14వ తేదీన మంచిర్యాలలో పీపుల్స్​మార్చ్ పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హాజరయ్యారు. మార్గమధ్యలో ఏప్రిల్ 16న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి అక్కడ రైతులతో సమావేశమై సమస్యలపై చర్చించారు.

Khammam Congress Meeting : మార్చి 29న పాదయాత్ర జనగామ జిల్లా నర్మెట్టకు చేరుకునేప్పటికీ 500 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. మే 1న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సోమేశ్వరాలయాన్ని, 3న యాదాద్రి దేవాలయం, బస్వాపురం రిజర్వాయర్‌లను ఆయన సందర్శించారు. మే 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణంపై జరుగుతున్న నిర్లక్ష్యవైఖరిపై రిటైర్డ్ ఇంజనీర్లతో, సామాజిక ఉద్యమకారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

Bhatti Peoples March padayatra Reached Khammam : పీపుల్స్​మార్చ్‌ యాత్ర జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లికి చేరుకునేప్పటికీ 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మే 23న ఉద్దండపూర్ ప్రాజెక్టు సందర్శన, భూ నిర్వాసితులతో సమావేశమై భట్టి చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మే 25న జడ్చెర్లలో పీపుల్స్​మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మే 27వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాలోని వట్టెం ప్రాజెక్టు సందర్శించి అక్కడ భూ నిర్వాసితులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

CLP Leader Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన అచ్చంపేట నియోజకవర్గం, బలుమూరు మండలం కేంద్రంలో తెలంగాణ లక్ష్యాలు- సాధించిన ఫలితాలు అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జూన్ 3వ తేదీన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్‌కు తమిళనాడు సీఎల్పీ లీడర్ సెల్వ పెరుతుంగై హాజరయ్యారు. జూన్ 6వ తేదీన అచ్చంపేట నియోజకవర్గం జోగ్యాతండా వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. అదేవిధంగా జూన్ 8న దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కల గండి ప్రాజెక్టును భట్టి పరిశీలించారు. జూన్ 10వ తేదీన అదే నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్నర్ సమావేశానికి ఛత్తీస్​గఢ్ రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యురాలు రంజిత రాజన్ హాజరయ్యారు. జూన్ 11న గుమ్మడవెల్లికి పీపుల్స్​మార్చ్ పాదయాత్ర చేరుకుని.. వెయ్యి కిలోమీటర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఓ పైలాన్ ఆవిష్కరణ చేశారు. జూన్ 18న నల్లగొండ పానగల్‌లోని సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

Bhatti Vikramarka Padayatra Conclude Meeting in khammam : ఆదిలాబాద్‌లో మొదలైన పీపుల్స్​మార్చ్‌ పాదయాత్ర ఖమ్మం వరకు మండే ఎండలను, వర్షాలను, ప్రతికూల పరిస్థితులను లెక్క చేయకుండా 109రోజుల పాటు నడక కొనసాగించి 1360 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. ఈ పాదయాత్రకు దారి వెంబడి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భట్టిని కలుస్తూ సంఘీభావం తెలియచేస్తూ వచ్చారు.

రాష్ట్రంలోని 17 జిల్లాల్లోని బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మపురి, పెద్దప‌ల్లి, హుజురాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధన్నపేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్​పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీంప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్​న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, పాలేరు, ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని నేడు ఖమ్మంలో జరిగే తెలంగాణ గర్జన సభకు చేరుకుంది. ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జనగర్జన సభకు హాజరవుతున్న రాహుల్​గాంధీ ఆయనను సన్మానించి పాదయాత్ర విరమింప చేస్తారు. మరోవైపు ఇదే తెలంగాణ జన గర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి ఆయన అనుచరులకు.. కాంగ్రెస్‌ కండువా కప్పి రాహుల్​గాంధీ పార్టీలోకి ఆహ్వానిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.