ETV Bharat / state

Huzurabad by election : హుజూరాబాద్​లో ఊహకందని పోరు.. ప్రచారంలో వాక్బాణాల హోరు

author img

By

Published : Aug 13, 2021, 10:10 AM IST

Updated : Aug 13, 2021, 10:57 AM IST

ఇద్దరూ మేటి రాజకీయ నాయకులే.!  తెలంగాణ ఉద్యమం సహా రాష్ట్ర అభివృద్ధిలో తమదైన పాత్రను పోషించిన దిట్టలే..!  ఒకరు తన గెలుపు కోసం కసరత్తు చేస్తుంటే మరొకరు.. ప్రత్యర్థి విజయావకాశాల్ని దెబ్బతీసే వ్యూహరచనలో తలమునకలవుతున్నారు. ఆ ఇద్దరే మాజీమంత్రి ఈటల రాజేందర్‌.. ప్రస్తుత మంత్రి తన్నీరు హరీశ్‌రావు. నిన్న మొన్నటి వరకు మోస్తరుగా ముందుకు సాగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పర్వం ఇప్పుడు ఊహకందని వేగంతో ఈ ఇద్దరు నేతల వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికవుతోంది. ఏళ్లతరబడి రాజకీయంలో ఆప్తులుగా ఉన్న ఆ ఇద్దరే ఇప్పుడు నువ్వా-నేనా అనేలా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల(Huzurabad by election)ను సవాలుగా స్వీకరించి అసలైన పోరాటానికి సై అంటున్నారు.

హుజూరాబాద్​లో ఊహకందని పోరు
హుజూరాబాద్​లో ఊహకందని పోరు

హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక(Huzurabad by election) రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన తెరాస-భాజపాల మధ్య పోరు హోరుగా సాగుతోంది. ఇరు పార్టీలు ప్రచారాలతో నియోజకవర్గంలో వేడి పుట్టిస్తున్నారు. వాక్బాణాలతో ఒకరిపై మరొకరు దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల తెరాస లోగుట్టును బయటపెడుతూ.. ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తుండగా.. మరోవైపు మంత్రి హరీశ్ రావు.. ఈటలపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. నియోజకవర్గంలో పిసరంత అభివృద్ధి కూడా జరగలేదని ఒకరంటుంటే.. అసలు తన నియోజకవర్గానికి నిధులే సరిగ్గా ఇవ్వలేదని మరొకరు మాటలు విసురుతున్నారు. ఇన్నాళ్లూ.. సాఫీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం.. మంత్రి హరీశ్ రావు రంగ ప్రవేశంతో.. రంజుగా మారింది.

ఇన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు అప్పగించిన బాధ్యతల్ని తెరవెనుక ఉండి నడిపించిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. సిద్దిపేట కేంద్రంగా నడిపించిన మంత్రాంగానికి తోడుగా.. క్షేత్రస్థాయిలో కాలుమోపి అసలైన కదనరంగానికి సిద్ధమయ్యారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి తనదైన మార్కుని ఇక్కడ వేసే పనిలో వేగాన్ని పెంచుతున్నారు. బుధవారం నియోజకవర్గంలో నిర్వహించిన రెండు సభలతోపాటు గురువారం మహిళలతో నిర్వహించిన సభలో తనదైన మాటలతో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విడమరిచి చెబుతూనే తనదైన తరహాలో ప్రజలకు పథకాల్ని చక్కగా వివరిస్తున్నారు. ఇక గ్రామాల వారీగా ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్‌ నుంచి తరలి వచ్చిన పార్టీ నాయకులకు బాధ్యతల్ని అప్పగించి తెరాస అభ్యర్థి గెలుపు అవకాశాలకు కృషి చేస్తున్నారు. ప్రతి వంద మందికి ఒకరిని బాధ్యుడిగా నియమించడంతోపాటు ఆయా గ్రామాలు, పట్టణాల వారీగా వాట్సాప్‌ సమూహాలను ఏర్పాటు చేసి తనకు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న గతానుభవాన్ని చేతల్లో చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌లను సమన్వయ పర్చుకుంటూనే ప్రత్యేర్థిపై పై చేయి సాధించేలా వ్యూహాత్మక అడుగుల్ని వేస్తున్నారు. ఈనెల 16న నిర్వహించే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ఇక్కడే మకాం వేశారు.

మద్దతు కూడగట్టుకుంటూనే..

అనూహ్య పరిణామాల మధ్య ఉప ఎన్నికలకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తనకు నియోజకవర్గంపై ఉన్న పట్టుని మరింత పెంచుకునే విషయంలో దృష్టిసారిస్తున్నారు. చాపకింద నీరులా తన వ్యూహరచనలతో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రజాశీర్వాదం పేరిట నిర్వహించిన పాదయాత్రకు ప్రజల మద్దతు లభించిన దరిమిలా.. అదే ఉత్సాహాన్ని ఊరూవాడల్లో ఇక మీదట చూపించే ప్రయత్నాల్ని చేస్తున్నారు. మోకాలి శస్త్ర చికిత్సతో అర్థంతరంగా యాత్ర వాయిదా పడటంతో స్వల్ప విరామం తరువాత ఇక్కడి నియోజకవర్గంలోనే ఉండి నేతల్ని సమన్వయ పర్చుకుంటూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ బలాన్ని ఎదుర్కోవాలంటే గ్రామాలు పట్టణాల్లో ఉన్న ప్రజలే తనకు అసలైన బలం అనేలా వ్యూహాత్మకంగా పంథాను మార్చుకుంటున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా తనపై జరుగుతున్న కుట్రల్ని తెలియజేస్తున్నారు. తనను విమర్శిస్తున్న తెరాస మంత్రుల వైఖరిని తనదైన తరహాలో తిప్పికొడుతున్నారు. మొత్తంగా హుజూరాబాద్‌ రాజకీయం(Huzurabad by election) వేడెక్కుతోంది.

Last Updated :Aug 13, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.